karnataka election 2023: కర్ణాటక కాంగ్రెస్‌ విజయం వెనుక ‘మిస్టర్‌ కె’..!

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం వెనుక ఓ రాజకీయ వ్యూహకర్త మేధస్సు ఉంది. పార్టీ ప్రచార తీరు నుంచి టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై చూసుకొన్నారు. పార్టీలోని వివిధ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి విజయపథంలో నడిపించారు.

Updated : 14 May 2023 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అతడో రాజకీయ వ్యూహకర్త.. పూర్తిగా లోప్రొఫైల్‌లో ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో వెతికినా కనిపించరు.. తన వాట్సాప్‌ ఖాతాలో ఫొటో కూడా పెట్టుకోరు. మీడియా కూడా ఆయన ఫొటో కోసం ఆపసోపాలు పడిన సందర్భాలున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌(Congress) విజయం (karnataka election 2023)అన్నీ తానై వ్యవహరించిన చతురుడు. టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అతి జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఆయన పేరు సునీల్‌ కనుగోలు(Sunil Kanugolu)..! ప్రస్తుతం కాంగ్రెస్‌ చీఫ్‌ ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌. 

2014లో మోదీతో కలిసి..

సునీల్‌ కర్ణాటకలోని బళ్లారిలో పుట్టారు. ఆ తర్వాత చదువు నిమిత్తం చెన్నైకి మకాం మార్చారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంబీఏ చదివారు. తర్వాత అక్కడే అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ మెకన్సీ కోసం పనిచేశారు. భారత్‌కు వచ్చిన తర్వాత గుజరాత్‌ రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా పనిచేశారు. ‘ది అసోసియేషన్‌ ఆఫ్‌ బిలియన్‌ మైండ్స్‌’కు చీఫ్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వ్యూహకర్తల బృందంలో సునీల్‌ కూడా ఒకరు. ఆ తర్వాత భాజపా కోసం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. 2019లో తమిళనాట స్టాలిన్‌ కోసం పనిచేసి సునీల్‌ డీఎంకేకు 38 పార్లమెంట్‌ స్థానాల్లో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఎన్నికలే స్టాలిన్‌ను తమిళనాడులో తిరుగు లేని నేతగా నిలబెట్టాయి. ఆ తర్వాత ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐప్యాక్‌ బృందం డీఎంకేకు సేవలందించడంతో సునీల్‌ బెంగళూరుకు వెళ్లిపోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సీఎం పళనిస్వామి కోరికమేరకు అన్నాడీఎంకేకు పనిచేశారు. 

బొమ్మై మాటను కాదని.. కాంగ్రెస్‌తో కలిసి..

గతేడాది మార్చిలో సునీల్‌ కనుగోలు కాంగ్రెస్‌తో కలిసే నాటికి ఆ పార్టీలో ఎన్నికల సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. అతడు హస్తం పార్టీతో జట్టుకట్టే విషయం తెలిసి.. కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అతడిని భాజపాలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నించారు. కానీ, ఆయన విజ్ఞప్తిని సునీల్‌ తిరస్కరించారు.  తాను కాంగ్రెస్‌ భావజాలాన్ని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఆయన కాంగ్రెస్‌లోకి నాటికి వర్గపోరు తీవ్రంగా ఉంది. రాహుల్‌, ప్రియాంక మద్దతుతో  సునీల్‌ ఎన్నికల బాధ్యతలు స్వీకరించి ఓ వ్యూహకర్తల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్‌ గాంధీ 4,080 కిలోమీటర్ల మేరకు నిర్వహించిన ‘భారత్‌ జోడో యాత్ర’లో ఆయన వ్యూహం ఉంది. ఇక కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేశారు. 

కర్ణాటక కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రి బొమ్మైపై 40శాతం కమీషన్లు తీసుకొంటున్నట్లు చేసిన ఆరోపణలను అవకాశంగా తీసుకొని ‘పేసీఎం’ పేరిట ప్రచారం నిర్వహించారు. ఇక అమూల్‌ వర్సెస్‌ నందినీ డెయిరీల వ్యహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రచారం చేయడంలో సునీల్‌ బృందం పాత్ర ఉంది. మరోవైపు భాజపా భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలతో ప్రచారానికి వెళుతుండగా.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో మాత్రం పూర్తిగా సామాన్యులను ప్రభావితం చేసే అంశాలు ఉండేలా ఈ బృందం జాగ్రత్తలు తీసుకొంది. కర్ణాటకలో చివరికి టికెట్ల పంపిణీల్లో సునీల్‌ బృందం సర్వే సూచనల మేరకే కాంగ్రెస్‌ అధినాయకత్వం చాలా కేటాయింపులు చేసింది.

భాజపాను అడ్డుకోవడానికి నిత్యం 20 గంటలు శ్రమించాల్సి వచ్చిందని సునీల్‌ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ఈ విజయంతో కాంగ్రెస్‌ పార్టీలో సునీల్‌ మరింత కీలకంగా మారారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కోసం పనిచేయనున్నారు. గతేడాది ఆయన పార్టీ తరపున పనిచేయడం మొదలుపెట్టిన రెండు నెలలకే సోనియా గాంధీ ఆయన్ను 2024 లోక్‌సభ ఎలక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని