Presidential Election: రాష్ట్రపతి రేసుకు యశ్వంత్‌ సిన్హా ఓకే.. !

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్‌ సిన్హా సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేగాక, ఈ పోటీ కోసం

Updated : 21 Jun 2022 14:12 IST

తృణమూల్‌కు రాజీనామా చేసిన నేత..!

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్‌ సిన్హా సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా నేడు ట్వీట్‌ చేశారు. ‘‘టీఎంసీలో మమతాజీ నాకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఓ పెద్ద దేశ ప్రయోజనం కోసం పార్టీ నుంచి వైదొలిగి.. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది. ఈ ముందడుగును దీదీ ఆమోదిస్తారన్న విశ్వాసం ఉంది’’ అని సిన్హా ట్విటర్‌లో రాసుకొచ్చారు.

రాష్ట్రపతి పదవికి భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు ఇప్పటికే ముగ్గురు నేతలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. రాష్ట్రపతి రేసుకు తొలుత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విముఖత చూపించగా.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ కూడా విపక్షాల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. అయితే సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపాలంటే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, వామపక్షాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు.

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. భాజపాను వీడిన ఆయన.. గతేడాది తృణమూల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన టీఎంసీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయితే వాజ్‌పేయీ హయాంలో, మోదీ నేతృత్వంలో పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్లు చెబుతున్నారు. నేడు ప్రధాన విపక్షాలతో శరద్‌ పవార్‌ నిర్వహిస్తున్న సమావేశంలో సిన్హా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిన్హా అభ్యర్థిత్వానికి మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

అయితే యశ్వంత్ సిన్హా పేరుపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ శిందే పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. మరి వీరిలో విపక్షాలు ఎవరిని ఎంచుకుంటాయో నేటి సమావేశంలో తెలిసే అవకాశముంది. మరోవైపు, నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు కూడా భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని