Andhra News: ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించొద్దు: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

అధికారం తలకెక్కితే ప్రజలు పెట్టాల్సిన చోట వాతలు పెడతారని నెల్లూరు రూరల్‌ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ

Published : 25 Jun 2022 20:12 IST

నెల్లూరు: అధికారం తలకెక్కితే ప్రజలు పెట్టాల్సిన చోట వాతలు పెడతారని నెల్లూరు రూరల్‌ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం శనివారం అన్నమయ్య సర్కిల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. 

ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎట్టి పరిస్థితుల్లో వేధింపులకు పాల్పడొద్దు, ఇబ్బందులు పెట్టొద్దని నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కడా కూడా వారిని శత్రువులుగా చూడొద్దు... రాజకీయాల్లో పోటీ దారులుగా మాత్రమే చూడండి. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ప్రజలకు జవాబుదారిగా ఉందాం. అందరినీ ప్రేమిద్దాం. ప్రత్యర్థి పార్టీలను పోటీ దారులుగా చూద్దాం.. శత్రువులుగా వద్దు. అధికారం తలకెక్కితే... అధికార మదంతో ప్రవర్తిస్తే.. ప్రజలు సమయం వచ్చినప్పుడు పెట్టాల్సిన చోట వాతలు పెడతారు’’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని