Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!

వరుణ సీటులో మాజీ సీఎం సిద్ధరామయ్యపై తన తనయుడు విజయేంద్ర పోటీ చేయబోతున్నారన్న వార్తల్ని భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప కొట్టిపారేశారు.

Published : 01 Apr 2023 01:38 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly polls) తేదీ ఖరారు కావడంతో అక్కడి రాజకీయ జోష్‌ మొదలైంది. గెలుపే లక్ష్యంగా  అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పొలిటికల్‌ హీటు పెంచుతున్నాయి. ఓ వైపు ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. తమ గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్యపై భాజపా తరఫున బీవై విజయేంద్ర పోటీ చేస్తారంటూ జరుగుతోన్న ప్రచారంపై మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప స్పందించారు. తన తనయుడు విజయేంద్ర వరుణ నుంచి పోటీ చేస్తారంటూ వస్తోన్న వార్తల్ని కొట్టిపారేశారు. శివమొగ్గ జిల్లాలోని తన సీటు శికారిపుర నుంచే విజయేంద్ర పోటీ చేయబోతున్నారని స్పష్టంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు.

విజయేంద్రను వరుణ నుంచి బరిలో దించాలని ఇప్పటికే ఒత్తిడి ఉందని యడియూరప్ప తెలిపారు. అయితే, వరుణ నుంచి పోటీ చేయాలన్న ఒత్తిడి ఉన్నప్పటికీ శికారిపురం నుంచే బరిలో ఉండాలని చాలా కాలం క్రితమే తాను చెప్పానన్నారు. అందువల్ల విజయేంద్ర ఎట్టిపరిస్థితుల్లో వరుణ నుంచి పోటీచేయరని తెలిపారు.  శికారిపుర తన నియోజకవర్గమని.. అందువల్ల అక్కడి నుంచే పోటీ చేస్తారన్నారు. భాజపాకు సొంత బలం ఉందని, పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానంటూ విజయేంద్ర చేసిన ప్రకటనపై విలేకర్లు అడగ్గా..  ‘విజయేంద్ర ప్రకటన నిజమే.. కానీ అతడు శికారిపుర నుంచి పోటీ చేస్తాడని నేను చెబుతున్నా. ఇదే విషయాన్ని నేను పార్టీ అధిష్ఠానం, విజయేంద్రకు తెలియజేస్తాను. మైసూరులోని వరుణ నుంచి నా తనయుడు పోటీచేసే అవకాశమే ఉండదు’’ అని యడియూరప్ప అన్నారు.  యడియూరప్ప ప్రస్తుతం శికారిపుర నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల రాజకీయాల నుంచి ఇప్పటికే ఆయన రిటైర్మెంట్‌ ప్రకటించారు.  మరోవైపు, మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గం నుంచి ఈసారి కర్ణాటక ప్రతిపక్షనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు. ఈ సీటు నుంచి ప్రస్తుతం ఆయన తనయుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని