YS Sharmila: భారాసతో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోం: వైఎస్‌ షర్మిల

వచ్చే ఎన్నికల్లో భారాసకు మెజారిటీ వచ్చే అవకాశం లేదని  వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. భారాసతో ఎప్పటికీ పొత్తు పెట్టుకునేది లేదని ఆమె తేల్చి చెప్పారు.

Updated : 01 Jun 2023 14:35 IST

హైదరాబాద్: భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరి తలపై రూ.లక్షన్నర అప్పు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన షర్మిల.. మీడియాతో మాట్లాడుతూ భారాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు షర్మిల 10 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు.

‘‘అవినీతి సొమ్మంతా సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. ప్రజలకిచ్చిన అన్ని హామీలను సీఎం తుంగలో తొక్కారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నా పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తానని కొందరు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఓ మహిళ కష్టాన్ని అవమానించొద్దు. అభ్యర్థులను తయారు చేసుకుని ఎన్నికల్లో పోటీకి నిలబెడతా. భారాసతో మేం ఎప్పటికీ పొత్తు పెట్టుకోం. పొత్తులపై భారాస, కాంగ్రెస్‌, భాజపా కూడా స్పష్టత ఇవ్వాలి. అప్పట్లో నేను చేరతానంటే కాదనే పార్టీ ఏదైనా ఉందా? వచ్చే ఎన్నికల్లో భారాసకు మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఎన్నికల తర్వాత భారాసతో పొత్తు ఉండబోదని కాంగ్రెస్‌ స్పష్టం చేయాలి’’ అని షర్మిల పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని