Andhra News: అప్పులు, అత్యాచారాల్లో రాష్ట్రానిదే తొలి స్థానం: రఘురామకృష్ణరాజు

రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Updated : 24 Dec 2022 08:49 IST

ఈనాడు, దిల్లీ: రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. అప్పులు, గంజాయి సరఫరా, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలిపిన ఘనుడు జగనే అని ఎద్దేవా చేశారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఎందుకు చెల్లించడం లేదని న్యాయస్థానం ప్రశ్నిస్తే... తన తండ్రి ఉపాధ్యాయుడేనని, ఆయనకూ తన చిన్నతనంలో మూడు నెలల పాటు జీతాలు చెల్లించలేదని సీఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పడాన్ని రఘురామ ప్రస్తావించారు. ఆయన చిన్నతనం అంటే యాభై ఏళ్ల కిందటే కదా! జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఆ మేరకు వెనక్కి వెళ్లినట్లే అని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వకపోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులకు అందజేస్తున్న ట్యాబ్‌ల కొనుగోళ్లలో రూ.221 కోట్ల అవినీతి చేయలేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఉత్తరాంధ్రలో పసుపు ప్రభంజనం కొనసాగుతోందని, రాజాం వంటి చిన్న పట్టణంలో చంద్రబాబు నాయుడి రోడ్‌ షోకు అశేష జనవాహిని తరలివచ్చిందని రఘురామ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని