Yuvagalam: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది.

Updated : 28 Sep 2023 17:41 IST

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు. 

కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబుని ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నందున దిల్లీలో న్యాయవాదులతో లోకేశ్‌ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్‌.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని