Boris Johnson: మోదీతో ‘ముఖ్య విషయాలు’ మాట్లాడతా

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయనకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర

Updated : 22 Apr 2022 06:40 IST

 రష్యా-భారత్‌ బంధాన్ని అందరూ అర్థం చేసుకున్నారు

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

గుజరాత్‌లో బిజీబిజీగా తొలిరోజు పర్యటన...

దిల్లీ, అహ్మదాబాద్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌ వచ్చారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయనకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌, మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బసచేసే హోటల్‌ వరకూ మొత్తం 4 కిలోమీటర్ల మేర ఆయన్ను ర్యాలీగా తోడుకొని వెళ్లారు. దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో శుక్రవారం దిల్లీలో సమావేశమవుతానని... వాణిజ్యం, భద్రత సహా పలు ముఖ్యమైన విషయాలపై ఆయనతో చర్చిస్తానని జాన్సన్‌ చెప్పారు.

సబర్మతి ఆశ్రమం సందర్శన

జాన్సన్‌... సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడున్న మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. బాపూజీ రచించిన ‘గైడ్‌ టు లండన్‌’, ఆయన శిష్యురాలు మీరాబెన్‌ ఆత్మకథ ‘ద స్పిరిట్స్‌ పిల్‌గ్రిమేజ్‌’ పుస్తకాలను ఆశ్రమ నిర్వాహకులు ఆయనకు అందజేశారు. అసాధారణమైన వ్యక్తికి చెందిన ఆశ్రమానికి రావడాన్నీ... ప్రపంచాన్ని మార్చేందుకు అహింస, సత్యాలను ఆయన మూలసూత్రాలుగా మార్చుకున్న విషయాన్ని తెలుసుకోవడాన్ని తాను గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు జాన్సన్‌ అక్కడ రాసిన తన సందేశంలో పేర్కొన్నారు.

గాంధీ నివసించిన హృదయ్‌ కుంజ్‌ వద్ద చరఖా తిప్పారు. ఆశ్రమ నిర్వాహకులు జాన్సన్‌కు చరఖా నమూనా ప్రతిని ఆయనకు బహుమతిగా అందజేశారు. సబర్మతి ఆశ్రమాన్ని బ్రిటన్‌ ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి.

ఆ బంధం తెలిసిందే...

గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా, హలోల్‌లో ఉన్న బ్రిటన్‌ నిర్మాణ సామగ్రి సంస్థ జేసీబీ తయారీ కేంద్రాన్ని జాన్సన్‌ సందర్శించారు. అక్కడ కొత్త కర్మాగారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌ సంక్షోభం విషయమై బ్రిటన్‌ ఇప్పటికే దౌత్యస్థాయిలో ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌-రష్యాల మధ్య భిన్నమైన చారిత్రక సంబంధాలు ఉన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన దారుణాలను భారత్‌ తీవ్రంగా ఖండించింది’’ అని జాన్సన్‌ పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ సహకారంతో గాంధీనగర్‌లో ఏర్పాటవుతున్న బయోటెక్నాలజీ యూనివర్సిటీని, అక్షరధామ్‌ ఆలయాన్నీ సందర్శించారు.

అదానీ గ్రూప్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి...

అహ్మదాబాద్‌ శివారు శాంతిగ్రామ్‌లోని అదానీ గ్రూప్‌ గ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లిన జాన్సన్‌... ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీతో సమావేశమయ్యారు. భారత్‌ తన సాయుధ బలగాలను 2030 నాటికి ఆధునికీకరించేందుకు సుమారు రూ.23 లక్షల కోట్లు (300 బిలియన్‌ డాలర్లు) వెచ్చించనున్న క్రమంలో- రక్షణ రంగంలో సహకారం పట్ల వారి మధ్య ప్రధానంగా చర్చ సాగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంధనం, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ టెక్నాలజీ, క్లైమేట్‌ యాక్షన్‌ తదితర అంశాలపైనా వారిద్దరూ చర్చించారు.

అభివాదం... వివాదాస్పదం...

జేసీబీ కర్మాగారాన్ని జాన్సన్‌ ప్రారంభించిన అనంతరం.. అక్కడున్న బుల్డోజర్‌పైకి ఎక్కారు. చేతులు ఊపుతూ మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు. వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన మతపరమైన విద్వేషాల క్రమంలో- భాజపా పాలిత దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పలు ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. భాజపా పాలిత ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ బుల్డోజర్లను ఉపయోగించి పలు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో జాన్సన్‌ బుల్డోజరుపైకి ఎక్కి చేతులు ఊపడం తీవ్ర చర్చకూ, విమర్శలకూ తావిచ్చింది.

భారతీయ నిపుణులకు మరిన్ని వీసాలు!

నిపుణులైన భారతీయులకు మరిన్ని వీసాలు మంజూరు చేస్తామని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయమై జరుగుతున్న చర్చల్లో ఈ అంశానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బ్రిటన్‌లో ఐటీ, ప్రోగ్రామింగ్‌ రంగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉందన్నారు. విదేశీయులు తమ దేశానికి రావడాన్ని ఆహ్వానిస్తున్నామని, వేల సంఖ్యలో నిపుణులకు వీసాలు జారీచేస్తామని జాన్సన్‌ చెప్పారు. యూకేలో స్కిల్స్‌ ఆధార వీసా పొందినవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. గత ఏడాది మొత్తం 67,839 మందికి బ్రిటన్‌ నైపుణ్య వీసాలు జారీచేసింది. 2019లో జారీచేసిన వాటి కంటే ఇవి 14% అధికం. చదువు తర్వాత పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడంతో... బ్రిటన్‌ విద్యాసంస్థల్లో చేరుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని