రవాణాశాఖలో ఎవరి మాట నెగ్గుతుందో!
రవాణా శాఖలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొందరు అధికారులు ‘రాబడి’ ఉండేచోట్ల పోస్టింగులకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ శాఖ కమిషనర్
నేతల సిఫార్సులతో బదిలీలకు తీవ్ర ప్రయత్నాలు
చివరి నిమిషంలో ఈ నెల29, 30కి వాయిదా
ఈనాడు-అమరావతి: రవాణా శాఖలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొందరు అధికారులు ‘రాబడి’ ఉండేచోట్ల పోస్టింగులకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ శాఖ కమిషనర్ మాత్రం నిబంధనలను ఉల్లంఘించేది లేదంటూ ఇప్పటికే ఉద్యోగులకు కచ్చితంగా చెప్పారు. నేతలకు చెక్పెట్టేందుకు వీలుగా శుక్ర, శనివారాల్లో బదిలీలు జరిపేందుకు కమిషనర్ ఏర్పాట్లు చేయగా, చివరి నిమిషంలో ఈ నెల 29, 30 తేదీలకు వాయిదా పడటంతో ఏం జరుగుతుందనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
* రెండేళ్లకుపైగా ఒకేచోట పని చేసిన అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం కాగా. కొందరు నేతలు తమకు కావల్సినవారికి పోస్టింగులు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీవో), మోటారు వాహన ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), ఏఎంవీఐ, పరిపాలన అధికారులను (ఏవో) బదిలీ చేసే అధికారం కమిషనర్ పరిధిలో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీలకు రవాణా కమిషనర్ కాటమనేని భాస్కర్ ఏర్పాట్లు చేశారు. రెండేళ్లు దాటిన వారిని, సీనియారిటీ ప్రాతిపదికన, ప్రాధాన్య కేంద్రం నుంచి అప్రధాన్య కేంద్రానికి, బదిలీలు చేసేలా ఆదేశాలిచ్చారు. కొందరు అధికారులు మాత్రం నేతల సిఫార్సుల ద్వారా ఆదాయం బాగుండే చోట పోస్టింగ్ల కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో మాదిరిగా నేతల లేఖలకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని, తర్వాత మిగిలిన వారిని నిబంధనల ప్రకారం బదిలీ చేయాలంటూ ఒత్తిళ్తు తెస్తున్నారు. సాధారణంగా రవాణాశాఖలో పెద్ద ఎత్తున ‘ప్రత్యేక రాబడి’ ఉండే చెక్పోస్టుల్లోను, ఎన్ఫోర్స్మెంట్లోను పోస్టింగ్లకు డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఎంవీఐల అధీనంలో ఉండే యూనిట్ కార్యాలయాలకు డిమాండ్ బాగానే ఉంటుంది.
అనూహ్యంగా వాయిదా!
గతంలో బదిలీల గడువు ముగిసే చివరిరోజు రాత్రి 10-12 గంటల మధ్య బదిలీల ఆదేశాలిచ్చేవారు. ఇప్పుడు నేతల సిఫార్సుల ద్వారా కొందరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటం, నిబంధనలకు వ్యతిరేకంగా పోస్టింగ్ల కోసం చూస్తుండటంతో.. 30వ తేదీ వరకు ఆగకుండా ముందే బదిలీలు చేపట్టేలా కమిషనర్ ఏర్పాట్లుచేశారు. శుక్రవారం (24న) ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏవోలకు కౌన్సెలింగ్ నిర్వహించి సాయంత్రానికి ఆదేశాలు ఇవ్వాలనుకున్నారు. శనివారం (25న) జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రవాణా హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు జోనల్ డీటీసీల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రానికి బదిలీలు పూర్తిచేసేలా ఆదేశాలిచ్చారు. అయితే అనూహ్యంగా ఈ బదిలీ ప్రక్రియను 29, 30 తేదీలకు వాయిదా వేస్తూ గురువారం సాయంత్రం ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు జిల్లాల్లో అధికారులకు సమాచారం పంపారు. ఎక్కువ మంది ఇంకా ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమనే చర్చ
జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు