సైబర్‌ నేరస్థుల రివర్స్‌ దందా!

ఇవి నయా దందాలు. ఏదో ప్రముఖ సంస్థ పేరు చెప్పి మోసాలకు పాల్పడే రోజులు పోయి ఏకంగా ఆ సంస్థ నుంచే ఖాతాదారుల వివరాలు సేకరించి దగా చేస్తున్నారు. దీంతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక సామాన్యులు తల్లడిల్లుతున్నారు.

Updated : 07 Jul 2022 06:33 IST

 ముందుగా అడ్వాన్సు చెల్లించిన వారికి కొత్తగా రాబోయే ఫోన్‌ ధరలో రాయితీ ఇస్తామని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ప్రకటించింది. దీంతో వినియోగదారులు రూ.25 వేల చొప్పున అడ్వాన్సు చెల్లించారు. కొద్ది రోజుల తర్వాత ఫోన్‌ చేసి రూ.మరో 50 వేలు చెల్లించమన్నారు. తర్వాత ఎన్నిరోజులు గడిచినా ఫోన్‌ రాలేదు. ఆ సంస్థ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే తమకు సంబంధం లేదన్నారు. కార్యాలయానికి వెళ్లి అడిగితే తాము ఎవరికీ కాల్‌ చేయలేదన్నారు. కంగుతిన్న వినియోగదారులు తాము ఫోన్‌కు అడ్వాన్స్‌ చెల్లించిన సమాచారం మూడో వ్యక్తికి ఎలా చేరిందని నిలదీశారు. తమ నుంచే వినియోగదారుల సమాచారం మోసగాళ్లకు చేరిందని నిర్ధారణకు వచ్చిన సదరు సంస్థ వినియోగదారులకు డబ్బు చెల్లించింది. ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు.


 హైదరాబాద్‌కు చెందిన ఆనంద్‌ (పేరు మార్చాం) గృహరుణం గురించి ఆరా తీసేందుకు ప్రముఖ బ్యాంకు వెబ్‌సైట్‌ నుంచి టోల్‌ఫ్రీ నంబర్‌ సేకరించి దానికి ఫోన్‌ చేశాడు. కానీ ఎవరూ ఆ ఫోన్‌ ఎత్తలేదు. కొద్దిసేపటి తర్వాత ఆనంద్‌కి వేరే నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి ఆనంద్‌ ఫోన్‌ చేసింది తమ కాల్‌సెంటర్‌కేనని... గృహరుణం తప్పకుండా మంజూరు చేస్తామని చెబుతూ బ్యాంకు ఖాతా వివరాలన్నీ తీసుకున్నాడు. ప్రాసెసింగ్‌ చార్జీల కింద రూ.25వేలు వసూలుచేశాడు. ఆనంద్‌ డెబిట్‌కార్డు, పిన్‌నంబర్లు కూడా సేకరించాడు. బ్యాంకు సిబ్బందే అన్న ఉద్దేశంతో ఆనంద్‌ కూడా అడిగిన వివరాలన్నీ ఇచ్చాడు. ఖాతా ఖాళీ అయిన తర్వాత కాని తెలియలేదు జరిగిన మోసం ఏమిటో...

ఇవి నయా దందాలు. ఏదో ప్రముఖ సంస్థ పేరు చెప్పి మోసాలకు పాల్పడే రోజులు పోయి ఏకంగా ఆ సంస్థ నుంచే ఖాతాదారుల వివరాలు సేకరించి దగా చేస్తున్నారు. దీంతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక సామాన్యులు తల్లడిల్లుతున్నారు.

 

తంలో తాము ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఖాతాదారులను నమ్మించే వారు. వ్యక్తిగత సమాచారం అడిగి మోసానికి పాల్పడేవారు. ఇలాంటి కేసులు పెరుగుతుండడం... వివరాలు ఎవరడిగినా చెప్పొద్దని బ్యాంకులు ఖాతాదారులకు తరచూ సందేశాలు పంపుతుండడంతో ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. సైబర్‌ నేరగాళ్ల కాళ్లకు బంధం పడడంతో వారు కొత్త పద్ధతి ఎంచుకున్నారు. ప్రముఖ సంస్థల నుంచే సమాచారం సేకరించి దోపిడీకి తెర తీస్తున్నారు. ఆయా సంస్థల కాల్‌సెంటర్లలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను వలలో వేసుకుని వారినుంచి బ్యాంకును సంప్రదించే ఖాతాదారుల వివరాలను సేకరిస్తున్నారు. మోసాలకు తెరతీస్తున్నారు. కొందరైతే వివరాల కోసం ఏకంగా ప్రముఖ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు, ఉద్యోగుల కంప్యూటర్లను హ్యాక్‌ చేస్తున్నారు.


అడ్డుకునేదెలా..

ఇలాంటి మోసాలను అడ్డుకోవడం కష్టంగా ఉంటోందని అధికారులే చెబుతున్నారు. తమకు సంబంధించిన సమాచారంతో సంప్రదిస్తున్నారు కాబట్టి బాధితులకు కూడా అనుమానం కలగడంలేదు. అయితే డబ్బు చెల్లించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, వీలైతే వ్యక్తిగతంగా సదరు కార్యాలయానికో, బ్యాంకుకో వెళ్లి పూర్తి వివరాలు ఆరా తీసిన తర్వాతనే డబ్బు చెల్లించాలని... దానికి సంబంధించిన రసీదు తీసుకోవాలని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కె.వి.ఎన్‌.ప్రసాద్‌ సూచించారు. డబ్బు చెల్లించాలన్నా, బ్యాంకు ఖాతా వివరాలు అడిగినా అనుమానించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని