
Kerala High Court: కొరియా నౌకపై పిటిషన్..కేరళ హైకోర్టులో అర్ధరాత్రి విచారణ
కోచిలో కొరియా నౌకను ఆపాలని ఆదేశాలు
కోచి: కోచి ఓడరేవు నుంచి బయలుదేరేందుకు సిద్ధమైన ఓ వాణిజ్య నౌకను ఆపేందుకు కేరళ హైకోర్టు తొలిసారిగా ఓ పిటిషన్ను అర్ధరాత్రి స్వీకరించి విచారణ చేపట్టింది. గ్రేస్ యంగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే దక్షిణ కొరియా కంపెనీ దాఖలుచేసిన పిటిషన్ను సోమవారం రాత్రి 11.30 గంటలకు జస్టిస్ దేవన్ రామచంద్రన్ వర్చువల్గా విచారించారు. అమ్బలముగల్లోని ఎరువుల ఫ్యాక్టరీకి సల్పర్ లోడు తీసుకొచ్చిన కొరియా నౌక ‘ఎంవీ ఓషన్ రోజ్’.. అన్లోడింగ్ పూర్తవడంతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఈ నౌక లంగరుకు తాము సదుపాయాలు కల్పించామని, ఆ బిల్లు రూ.2.5 కోట్లు ఇవ్వకుండానే మంగళవారం ఉదయం వెళ్లిపోయేందుకు సిద్ధమైందని గ్రేస్ కంపెనీ ముందురోజు రాత్రి హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పార్టీలను వర్చువల్గా విచారించిన న్యాయమూర్తి.. తక్షణమే ఓడను ఆపి బిల్లు మొత్తం రాబట్టాలని పోర్టు ట్రస్టుకు ఉత్తర్వులిచ్చారు.