నా భార్య ఆడది కాదు.. నేను మోసపోయా!

‘నా భార్యకు బాహ్య పురుష జననేంద్రియాలు ఉన్నాయి. ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు. నేను మోసపోయాను. 

Updated : 14 Mar 2022 10:40 IST

న్యాయం కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టిన భర్త 

దిల్లీ: ‘నా భార్యకు బాహ్య పురుష జననేంద్రియాలు ఉన్నాయి. ఈ విషయం దాచిపెట్టి పెళ్లి చేశారు. నేను మోసపోయాను. నాకు న్యాయం చేయండి’ అంటూ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌కు చెందిన ఓ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘ఆమె పుట్టుకతో ఆడదే. అండాశయం ఉంది. అయితే, అవిచ్ఛిన్నమైన కన్నెపొరకు తోడు బాహ్య పురుష జననాంగం కూడా ఉంది’ అని వైద్య నివేదిక చెబుతోంది. స్త్రీ, పురుష సంబంధాలకు సవాలు విసిరేలాంటి ఈ విచిత్రమైన కేసు గత శుక్రవారం తన ముంగిటకు రావడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణకు తొలుత విముఖత వ్యక్తం చేసినప్పటికీ, వైద్య నివేదికను పరిశీలించిన తర్వాత ఆ మహిళకు నోటీసు పంపాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ దంపతులకు 2016లో పెళ్లయింది. సంసార జీవితానికి మొదట్లో కొన్నిరోజులు ఆవిడ నిరాకరిస్తూ వచ్చింది. తీరా ఒప్పుకొన్నాక ఆమెలో పురుష లక్షణాలున్న విషయం బయటపడి భర్త అవాక్కయ్యాడు. వెంటనే వైద్యపరీక్ష చేయించాడు. ఆమెకు ‘కంజెనిటల్‌ అడ్రినల్‌ హైపర్‌ప్లాసియా’ అనే జన్యుపరమైన రుగ్మత ఉన్నట్లు తేలింది. దీనిప్రకారం తన బాహ్య జననేంద్రియాలు బాలుడికి లాగా ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా మార్పు చేయించుకోవచ్చని కూడా వైద్యుడు సూచించారు. ఈ విషయం తనకు చెప్పకుండా పెళ్లి చేశారంటూ భర్త ఆమెను పుట్టింటికి పంపేయడంతో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు పంచాయితీలు నడిచాయి. పరస్పరం పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. ఆమెతో వైవాహిక జీవితం కష్టమని, సంతానోత్పత్తి కూడా సాధ్యం కాదని ట్రయల్‌ కోర్టులో వైద్యుడు నివేదిక ఇచ్చాడు. కోర్టు ఆదేశానుసారం తాజా వైద్యపరీక్షకు వెళ్లేందుకు ఆమె నిరాకరిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెలో మహిళకు ఉండాల్సిన లక్షణాలు, అవయవాలు అన్నీ ఉన్నందున.. ఇందులో మోసం ఏదీ లేదంటూ అక్కడ తీర్పు వెలువడింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్‌ల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని