Congress: ఓటమితో కాంగ్రెస్‌లో చలనం క్రియాశీలకంగా అధిష్ఠానం

అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ గుణపాఠంగా తీసుకుంది. 

Updated : 31 Mar 2022 09:31 IST

అసమ్మతి స్వరాల అదుపునకు మూడో పక్షం విచారణ
సామాజిక మాధ్యమాల్లోనూ దూకుడు

ఈనాడు, దిల్లీ: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓ గుణపాఠంగా తీసుకుంది. సత్వర నిర్ణయాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలు.. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎప్పటికప్పుడు చక్కబెట్టే పనిలో పడింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేరుగా మార్గనిర్దేశం చేస్తూ క్రియాశీలంగా వ్యవహరిస్తుండడంతో అన్ని స్థాయిల నేతల్లో కదలిక ప్రారంభమైంది. ఎన్నికల అనంతరం అయిదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను మార్చడం, తరచూ విమర్శలు చేస్తున్న జీ 23 నేతలతో సమావేశాలు, సభ్యత్వ నమోదుపై సమీక్షలు అందులో భాగమే.

ఇదంతా ఎందుకంటే.. 

ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపాతో కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడనుంది. పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురల్లోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లపై పార్టీ ఎక్కువగా దృష్టిసారిస్తోంది. సంస్థాగత బలహీనతలే ఓటమికి కారణమని పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. గురువారంతో ముగియనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల నేతల పనితీరును బేరీజు వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు అయిదు కోట్ల మంది కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్నారు. 

సభ్యత్వాల్లో తెలంగాణ అగ్రగామి

40 లక్షల సభ్యత్వాల నమోదుతో తెలంగాణ ప్రథమ స్థానంలో, 36 లక్షలతో కర్ణాటక ద్వితీయ స్థానంలో ఉన్నాయి. పలువురు ఉత్తరాది నేతలు పార్టీ సభ్యత్వంపై దృష్టిపెట్టకపోవడంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. దిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలు హిందీ, ఇంగ్లిషు భాషల్లోనే ప్రకటనలు విడుదల చేస్తుండడంతో ఆయా రాష్ట్రాల ప్రజలకు దగ్గర కాలేకపోతున్నామని అధిష్ఠానం భావిస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ మొదలు ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు ఇక ముందు ప్రాంతీయ భాషల్లో ట్వీట్లు చేయాలని నిర్ణయించారు. ఆ ట్వీట్లకు ప్రత్యర్థి పార్టీలు స్పందించినప్పుడు తమ కార్యకర్తలు చురుగ్గా వ్యవహరిస్తారని పార్టీ నేత ఒకరు తెలిపారు.

విమర్శిస్తున్నవారిపై నివేదికలు 

పార్టీ అధిష్ఠానంపై, రాష్ట్ర నాయకత్వాలపై తరచూ విమర్శలు/ ఫిర్యాదులు చేసే నేతలపైనా అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీతో సంబంధంలేని తృతీయపక్ష సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటి? పార్టీ ప్రకటించిన కార్యక్రమాల్లో ఎందుకు చురుగ్గా లేరు? అంటూ వారికి ప్రశ్నలు సంధిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని