India-Britain: భారత్‌-బ్రిటన్‌ వాణిజ్యం కొత్తపుంతలు

‘రానున్న రోజుల్లో భారత్‌-బ్రిటన్‌ మధ్య దౌత్య సంబంధాలు మరింతగా విస్తరిస్తాయి. వాణిజ్యం రెండింతలు అవుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాల అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది.

Updated : 21 Apr 2022 11:31 IST

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని పెట్టుబడులు 

ఇంగ్లాండ్‌లో భారత్‌ కంపెనీలకు పెద్దపీట
విద్యార్థి వీసాలు భారీగా పెరిగాయి 
నేటి నుంచి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన
‘ఈనాడు’కు బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఐఆర్‌ శ్రీనివాసరావు

 ఈనాడు-హైదరాబాద్‌

‘రానున్న రోజుల్లో భారత్‌-బ్రిటన్‌ మధ్య దౌత్య సంబంధాలు మరింతగా విస్తరిస్తాయి. వాణిజ్యం రెండింతలు అవుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో రెండు దేశాల అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది. బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ గురువారం నుంచి భారత్‌లో పర్యటిస్తారు. ఇంగ్లాండ్‌ కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని కంపెనీలు బ్రిటన్‌లో పాదం మోపేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం.  బ్రిటన్‌లోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల 21 శాతానికి చేరటం విశేషం’ అని హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ అన్నారు. బ్రిటన్‌ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

భారత్‌-బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పురోగతి, భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?

రెండు దేశాల వాణిజ్య పునాదులు చాలా బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత బలోపేతం కానున్నాయి. కరోనా ముందు వరకు 23 బిలియన్‌ పౌండ్ల వాణిజ్యం నమోదైంది. సుమారు అయిదు లక్షల ఉద్యోగాలకు ఆ వాణిజ్యం అవకాశం కల్పించింది. 2030 నాటికి రెండు దేశాల వాణిజ్య విలువలను రెట్టింపు చేయాలన్నది లక్ష్యం. గడిచిన ఏడాది శ్రీకారం చుట్టిన సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ప్రధానుల సమావేశం మరింత పురోగతికి దోహదపడుతుంది. ఆరోగ్యం, సాంకేతిక రంగాల్లో మార్కెట్‌ వెసులుబాటును మరింత కల్పించాలని ఇప్పటికే నిర్ణయించాం. బ్రిటన్‌కు చెందిన సుమారు 600 కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మా దేశంలో 95 వేల మంది భారతీయ ఉద్యోగులున్నారు. భారత్‌ మాకు రెండో అతిపెద్ద పెట్టుబడి వనరు.

ఏయే రంగాలపై బ్రిటన్‌ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి?

గడిచిన ఏడాది గ్రాంట్‌ థోర్నటన్‌ ఆవిష్కరించిన ‘బ్రిటన్‌ మీట్స్‌ ఇండియా’ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్‌కు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఆర్థిక సేవలు, సాంకేతిక, రిటైల్, ఈ-కామర్స్, ఎనర్జీ అండ్‌ పవర్, ఆరోగ్య సంరక్షణ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడులు పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల వైపు ఇంకా చాలా కంపెనీలు చూస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఫుడ్‌ డెలివరీ దిగ్గజ సంస్థ డెలివెరూ గడిచిన వారంలో హైదరాబాద్‌లో అధునాతన కేంద్రాన్ని ప్రారంభించింది. 

ఇక్కడ ఐటీ, ఫార్మాసూటికల్‌ రంగాల్లో పెట్టుబడులకు మీ ఆలోచనలు ఏమిటి?

ఇక్కడ ఐటీ, ఫార్మా కంపెనీలు పురోగమనంలో ఉన్నాయి. బ్రిటన్‌లో కూడా ఆయా రంగాల్లో భారతీయ కంపెనీలు తమదైన ముద్రను కొనసాగిస్తున్నాయి. ఇక్కడి కంపెనీలు బ్రిటన్‌లో విస్తరించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. పరిశోధన, అభివృద్ధికి అక్కడ అవకాశాలున్నాయి. యూరప్, ఆఫ్రికా మార్కెట్లకు బ్రిటన్‌ ముఖద్వారంగా ఉంటుంది. బ్రిటన్‌ కంపెనీలూ తెలుగు రాష్ట్రాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మైక్రోబయోమిక్స్, జెనోమిక్స్‌ రంగాల కోసం ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్స్‌ సృష్టికర్త ఈగిల్‌ జెనోమిక్స్‌ సంస్థ బయోరెవల్యూషన్‌కు పునాది వేసే లక్ష్యంతో హైదరాబాద్‌లో టెక్‌హబ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికను ప్రకటించింది. జీవశాస్త్రం, డేటా సైన్స్, బయో ఇన్ఫర్మేటిక్స్‌ను మిళితం చేసి యాంటీబయోటిక్‌ రెసిస్టెన్స్, నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులతో పోరాటానికి కృషి  చేస్తోంది. 

ఉక్రెయిన్‌-రష్యా వ్యవహారాలు మన సంబంధాలపై ప్రభావాన్ని చూపుతాయా?

ఎలాంటి ప్రభావం ఉండదు. రష్యా-ఉక్రెయిన్‌ వ్యవహారంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ప్రముఖ దౌత్య పాత్రను నిర్వహించాల్సిన అవసరం ఉంది. 

బ్రిటన్‌ వాణిజ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వాటా ఎంత?

గడిచిన అయిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే రెండు రాష్ట్రాలకు వస్తున్న వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. బ్రిటన్‌ ఉత్పత్తులపై ఆసక్తి చూపే భారతీయుల సంఖ్య బిలియన్‌ కన్నా ఎక్కువే. రెట్టింపు స్థాయిలో మా ఎగుమతులను పెంచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టెక్స్‌టైల్స్, విద్యుత్‌ వాహన రంగాల్లో మరింత పెరుగుదలకు అవకాశం ఉంది. 

భారతీయ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారు?

ఉన్నత విద్యను చదివే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అనూహ్య పెరుగుదలను గమనించాను. గడిచిన ఏడాది భారతీయ విద్యార్థులకు 90,500 వీసాలు ఇచ్చాం. భారతీయ విద్యార్థుల వాటా 21 శాతం. నైపుణ్య ఉద్యోగ వీసాల్లో 40 శాతం భారతీయులకు ఇచ్చాం. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి పని అనుభవానికి వీలుగా రెండేళ్ల అదనపు వీసా ప్రయోజనాన్ని కల్పించాం. 2019-21 వరకు 2.1 మిలియన్‌ పౌండ్ల ఉపకార వేతనాలను భారతీయ విద్యార్థులు అందుకోవటం విశేషం. ఇంగ్లిషు-ఆర్ట్స్‌ రంగాల్లో తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వంతో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాం. రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(రిచ్‌)తో కలిసి పని చేస్తున్నాం. విద్య, వాణిజ్య రంగాలపై కొవిడ్‌-19 ప్రభావం అంతగా లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని