ఇంగ్లాండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి 

ఇంగ్లాండ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు రెండు రోజుల్లో ముగుస్తాయని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్పష్టం చేశాడు...

Published : 03 Mar 2021 01:21 IST

ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు: ఆర్చర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు రెండు రోజుల్లో ముగుస్తాయని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్పష్టం చేశాడు. తాజాగా అతడు ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఇంగ్లాండ్‌ మాజీలు ఆ పిచ్‌పై విమర్శలు చేశారు. అది టెస్టు క్రికెట్‌కు సరైన పిచ్‌ కాదని అన్నారు. ఈ క్రమంలోనే ఆర్చర్‌ ఇలా స్పందించడం గమనార్హం.

‘మేం ఎలాంటి పిచ్‌ల మీద ఆడుతున్నామనే విషయం నాకు అవసరం లేదు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన పని కూడా లేదు. నేను ఇంగ్లాండ్‌లో మూడేళ్ల క్రితం గ్లామర్గాన్‌ జట్టుతో డే/నైట్‌ మ్యాచ్‌ ఆడినప్పుడు ఐదు సెషన్లలోనే ఆట అయిపోయింది. అలాగే సస్సెక్స్‌ జట్టు తరఫున లీకెస్టర్‌షైర్‌తో తలపడినప్పుడు కూడా రెండు రోజుల్లోనే పూర్తి అయింది. దీన్ని బట్టి అక్కడ కూడా రెండు రోజుల్లో మ్యాచ్‌లు పూర్తవుతాయని తెలుస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే భారత్‌లో ఆడేటప్పుడు స్పిన్‌ పిచ్‌లే ఉంటాయని ముందే ఆశించాలి. బ్యాటింగ్‌ చేయడం అంత తేలికకాకపోయినా.. పెద్ద సమస్య కాదు’ అని ఆర్చర్‌ అందులో వివరించాడు.

కాగా, ఈ సిరీస్‌లో ఆర్చర్‌ ఇప్పటివరకు రెండు టెస్టులే ఆడాడు. తొలి టెస్టులో 3 వికెట్లు తీసిన అతడు పింక్‌బాల్‌ టెస్టులో ఒక్క వికెటే పడగొట్టాడు. దీంతో మొత్తంగా 4 వికెట్లే తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రెండో టెస్టులో ఆర్చర్‌కు బదులు తుది జట్టులోకి తీసుకున్న స్టువర్ట్‌ బ్రాడ్‌ గత రెండు టెస్టుల్లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని