Team India: 10 మంది 10 కొట్టలేదు!

టీ20 క్రికెట్‌.. చాలా విచిత్రమైన ఆట! అప్పటికప్పుడు హీరోలుగా చేస్తుంది. క్షణాల్లో జీరోలుగా మారుస్తుంది. ఎంత పటిష్ఠమైన జట్టైనా కొన్నిసార్లు....

Updated : 24 May 2021 12:04 IST

ధోనీసేన కోరుకోని రికార్డిది

టీ20 క్రికెట్‌.. చాలా విచిత్రమైన ఆట! అప్పటికప్పుడు హీరోలుగా చేస్తుంది. క్షణాల్లో జీరోలుగా మారుస్తుంది. ఎంత పటిష్ఠమైన జట్టైనా కొన్నిసార్లు తేలిపోతుంది. భీకర బౌలింగ్‌ను ఊచకోత కోసే బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు చేయలేకపోతారు. టీమ్‌ఇండియాకూ ఇది తప్పలేదు. ఆసీస్‌పై 74కే ఆలౌటైన ఓ పోరులో 10 మంది బ్యాటర్లు 10 స్కోరును అందుకోలేకపోయారు తెలుసా!


ఇదే తొలిసారి

పొట్టి క్రికెట్‌ ఫార్మాట్లో టీమ్‌ఇండియా మూడుసార్లు వందలోపే ఆలౌటైంది. అందులో అత్యల్ప స్కోరు 74. మెల్‌బోర్న్‌ వేదికగా 2008, ఫిబ్రవరిలో ఆసీస్‌తో జరిగిన మ్యాచులో చేసింది. భారత టీ20 చరిత్రలో తొలిసారి 10 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు చేయలేక ఇబ్బంది పడ్డారు. టెస్టులాడే దేశాల్లో ఘోరమైన గణాంకాలు ఇవే. ఆతిథ్య జట్టు మరో 52 బంతులు మిగిలుండగానే వికెట్‌ నష్టపోయి విజయం సాధించింది. న్యూజిలాండ్‌, విండీస్‌కూ ఇలాంటి రికార్డులున్నా వారి స్కోర్లు 80, 101 కావడం గమనార్హం.


పెవిలియన్‌కు వరుస

9, 0, 8, 1, 8, 9, 26, 6, 1, 0, 3*.. ఇవీ టీమ్‌ఇండియా ఆటగాళ్ల స్కోర్లు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేనను నేథన్‌ బ్రాకెన్‌ (3), ఆడమ్‌ వోజెస్‌ (2) బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ ఐదో బంతికే సెహ్వాగ్‌ (0) రనౌట్‌ అయ్యాడు. డైవ్‌ చేస్తూ క్లార్క్‌ వికెట్లకు బంతిని విసిరాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గంభీర్‌ (9; 6 బంతుల్లో 1×4)ను బ్రాకెన్‌ పెవిలియన్‌ పంపించాడు. 12 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 20 వద్ద ధోనీసేనకు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. 3 బంతుల వ్యవధిలో దినేశ్‌ కార్తీక్‌ (8; 8 బంతుల్లో 1×4), రాబిన్‌ ఉతప్ప (1; 3 బంతుల్లో) ఔటయ్యారు. బ్రెట్‌లీ 2.6వ వేసిన లో ఫుల్‌టాస్‌కు డీకే వికెట్లు ఎగిరాయి. అప్పట్లో మిడిలార్డర్లో వచ్చే రోహిత్‌ (8; 8 బంతుల్లో 1×4)ను జేమ్స్‌ హోప్స్‌ బౌల్డ్‌ చేశాడు. దాంతో 7 ఓవర్లకు భారత్‌ 32/5తో నిలిచింది.


నిలిచిన ఇర్ఫాన్‌.. ధోనీ

టీమ్‌ఇండియా కనీసం 50 పరుగులైనా చేయగలదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఎంఎస్‌ ధోనీ (9; 27 బంతుల్లో), ఇర్ఫాన్‌ పఠాన్‌ (26; 30 బంతుల్లో) నిలబడ్డారు. వీరిద్దరూ కలిసి ఒక్క బౌండరీ బాదలేదు. వికెట్ల మధ్య పరుగెడుతూనే ఆ మాత్రం స్కోరు చేశారు. అదీ గొప్పే. ఎందుకంటే భీకరమైన ఆ బౌలింగ్‌ దాడిని ఎదుర్కొంటూ ఈ ద్వయం దాదాపు 10 ఓవర్లు నిలిచింది. లేదంటే జట్టు మొత్తంగా 10 ఓవర్లకే చాప చుట్టేసేదే. ఆరో  వికెట్‌కు వీరిద్దరూ 30 బంతుల్లో 17 పరుగులు చేయడం గమనార్హం. ఐతే 12వ ఓవర్లో ధోనీని హస్సీ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 49/6. మరో 11 పరుగులకే ప్రవీణ్‌ కుమార్‌ (6)ను నోఫ్కె పెవిలియన్‌ పంపించాడు. 63 పరుగుల వద్ద వరుస బంతుల్లో హర్భజన్‌ (1) , శ్రీశాంత్‌ (0)ను ఆడమ్‌ వోజెస్‌ ఔట్‌ చేశాడు. 17.3వ బంతికి పఠాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను గిల్లీ అందుకోవడంతో టీమ్‌ఇండియా కథ ముగిసింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని