10 మంది పాక్‌క్రికెటర్లకు కరోనా

ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి చేరుకున్న పాక్‌ క్రికెటర్లకు కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతోంది. తొలుత ఆరుగురికి ఈ వైరస్‌ సోకగా తర్వాత మరొకరికి చేరింది...

Published : 02 Dec 2020 00:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు అక్కడికి చేరుకున్న పాక్‌ క్రికెటర్లకు కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతోంది. తొలుత ఆరుగురికి ఈ వైరస్‌ సోకగా తర్వాత మరొకరికి వ్యాపించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఇంకో ముగ్గురు క్రికెటర్లు దాని బారిన పడ్డారు. దీంతో ఆ జట్టులో మొత్తం వైరస్‌కు గురైన ఆటగాళ్ల సంఖ్య 10కి చేరింది. ఈనెల 24న 34 మంది ఆటగాళ్లు, 20 మంది సిబ్బందితో పాక్‌ క్రికెట్‌ జట్టు క్రైస్ట్‌చర్చ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ పలువురు ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రవర్తించారని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తొలిసారి వారికి నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురు క్రికెటర్లకు పాజిటివ్‌గా తేలింది. రెండు రోజుల కింద నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి, తాజా పరీక్షల్లో మరో ముగ్గురికి వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో పాక్‌ క్రికెట్‌ జట్టులో పెద్ద కలవరం మొదలైంది. ఇప్పడింత మంది వైరస్‌ బారిన పడడంతో జరగాల్సిన మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

లూయిస్‌ హామిల్టన్‌కు పాజిటివ్‌..
మరోవైపు ఫార్ములా వన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ కరోనా బారిన పడ్డాడని, దీంతో ఈ వారం చివర్లో బహ్రెయిన్‌లో జరగాల్సిన సాఖిర్‌ గ్రాండ్‌ ప్రి ఈవెంట్‌లో అతడు పాల్గొనట్లేదని మెర్సిడెజ్‌ బెంజ్‌ రేసింగ్‌ టీమ్‌ ట్విటర్‌లో తెలిపింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడని, లూయిస్‌ని కలిసిన వారిని గుర్తించి వారికి సమాచారం అందించామని చెప్పింది. సాఖిర్‌ ఈవెంట్‌లో పాల్గొనడానికి ముందు లూయిస్‌కు గతవారం మూడుసార్లు పరీక్షలు చేసినా నెగిటివ్‌ వచ్చిందని, అయితే.. సోమవారం స్వల్ప లక్షణాలు కనపడడంతో మరోసారి కొవిడ్‌ 19 పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ వారంతంలో జరిగే సాఖిర్‌ గ్రాండ్‌ ప్రీలో పాల్గొనాలంటే మెర్సిడీజ్‌ టీమ్‌ లూయిస్‌కు బదులు మరో డ్రైవర్‌ను నియమించాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని