73/5.. ఆసీస్‌ను గెలిపించిన మాక్సీ, కేరీ

ఆస్ట్రేలియా అన్నంత పనీ చేసింది. టీ20 సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌కు 2015 తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ ఓటమి రుచి చూపించింది. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో ఘన విజయం...

Published : 17 Sep 2020 09:08 IST

సిక్సర్లతో బెంబేలెత్తించిన మాక్స్‌వెల్‌

మాంచెస్టర్‌: ఆస్ట్రేలియా అన్నంత పనీ చేసింది. టీ20 సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌కు 2015 తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ ఓటమి రుచి చూపించింది. మాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఆఖరి, నిర్ణయాత్మక వన్డేలో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (108; 90 బంతుల్లో 4×4, 7×6), అలెక్స్‌ కేరీ (106; 114 బంతుల్లో 7×4, 2×6) శతకం Ùబాదడంతో 303 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించేసింది. ఛేదనలో 73కే 5 వికెట్లు పోగొట్టుకోవడంతో మ్యాచ్‌ ఉత్కంఠకరంగా సాగింది.

కేరీ+మాక్సీ=212

ఛేదనలో ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 21 వద్దే ఆరోన్ ఫించ్‌ (12) వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్‌ వార్నర్‌ (24), స్టొయినిస్‌ (4), లబుషేన్‌ (20), మిచెల్‌ మార్ష్‌ (2) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో 73/5తో కంగారూలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఆపద్బాంధవుడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ క్రీజులోకి దిగాడు. అలెక్స్‌ కేరీతో కలిసి సమయోచితంగా ఆడాడు. కేరీ నిలకడగా ఆడగా మాక్సీ మాత్రం దంచుడే పనిగా పెట్టుకున్నాడు. 48 బంతుల్లో 50, 84 బంతుల్లో శతకం బాదేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేరీ ఆచితూచి ఆడుతూ శతకం బాదడంతో వీరిద్దరూ ఆరో వికెట్‌ కు ‌ 212 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 285 వద్ద మాక్సీ‌, 293 వద్ద కేరీ వెనుదిరిగారు. చివర్లో కమిన్స్‌ (4*), స్టార్క్‌ (11*) అవసరమైన పరుగులు చేసి విజయం అందించారు.

బెయిర్‌స్టో శతకం వృథా

అంతకు ముందు టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ డకౌట్‌ అయినా మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (112; 126 బంతుల్లో 12×4, 2×6) అద్భుత శతకం బాదేశాడు. జోస్‌ బట్లర్‌ (8), ఇయాన్‌ మోర్గాన్‌ (23) విఫలమైనా సామ్‌ బిల్లింగ్స్‌ (57; 58 బంతుల్లో 4×4, 2×6), క్రిస్‌వోక్స్‌ (53*; 39 బంతుల్లో 6×4) అర్ధశతకాలు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఈ సిరీస్‌ ముగియడంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలోని కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని