పంత్‌పై నోరు పారేసుకున్న మాథ్యూవేడ్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ మాథ్యవేడ్‌ టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌పై నోరు పారేసుకున్నాడు. ‘‘మళ్లీ నిన్ను నువ్వు పెద్ద స్క్రీన్‌ మీద చూసుకుంటున్నావా?

Published : 28 Dec 2020 15:00 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ మాథ్యవేడ్‌ టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌పై నోరు పారేసుకున్నాడు. ‘‘మళ్లీ నిన్ను నువ్వు పెద్ద స్క్రీన్‌ మీద చూసుకుంటున్నావా? నువ్వు అలా చూసుకోవడం చాలా సరదాగా ఉంది’’ అని అన్నాడు. ఆ మాటలు స్టంప్‌ మైక్‌లో వినిపించడంతో ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. 

సోమవారం మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ షాట్లు ఆడలేకపోవడం, భారత బౌలింగ్‌ను సరిగ్గా ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన సందర్భాల్లో పంత్‌ నవ్వుతూ కనిపించడంపై వేడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే రెండో సెషన్‌ పూర్తయ్యాక టీ విరామంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌.. పంత్‌పై మరోసారి తన అక్కసును ప్రదర్శించాడు. టీమ్‌ఇండియా కీపర్‌ ఏమీ మాట్లాడకుండా ఎప్పుడూ నవ్వుతుంటాడని వేడ్‌ పేర్కొన్నాడు. తమని చూసి అలా నవ్వడంలో ఏం జోక్‌ ఉందో అర్థం కావడం లేదన్నాడు. బహుశా తన బ్యాటింగ్‌ చూసి పంత్‌ నవ్వుతుండొచ్చని చెప్పాడు.

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. 277/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా 326 పరుగులకు ఆలౌటైంది. రహానె(112), జడేజా(57) ఔటయ్యాక టెయిలెండర్లు పెద్దగా రాణించలేకపోయారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 133/6తో నిలిచింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అధిగమించి 2 పరుగులు ఎక్కువ సాధించింది. అంతకుముందు 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే, చివర్లో కామరూన్‌ గ్రీన్‌(17), పాట్‌ కమిన్స్‌(15) నిలకడగా ఆడి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక మంగళవారం ఆస్ట్రేలియా టెయిలెండర్లు టీమ్‌ఇండియా ముందు ఏ మాత్రం లక్ష్యం నిర్దేశిస్తారనే విషయం ఆసక్తి రేపుతోంది.

ఇవీ చదవండి..
ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే 
రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు