టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..

మెల్‌బోర్న్‌ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమ్‌ఇండియా కొద్దిసేపటి క్రితమే తుది జట్టును ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది...

Updated : 26 Dec 2020 03:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెల్‌బోర్న్‌ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే తుది జట్టు ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ పృథ్వీషాను తొలగించింది. మయాంక్‌కు తోడుగా శుభ్‌మన్‌గిల్‌కు అవకాశం ఇచ్చింది. వికెట్‌ కీపర్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహాను పక్కనపెట్టి రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన రిషభ్‌పంత్‌ను ఎంపిక చేసింది. అలాగే గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమైన మహ్మద్‌ షమి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకుంది. గిల్‌, సిరాజ్‌కు ఇదే తొలి టెస్టు కావడం విశేషం.

ఇక అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పితృత్వపు సెలవుల మీద తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టు నుంచి అజింక్య రహానె జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడికి సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా సైతం తుది జట్టులో అవకాశం పొందాడు. తొలి టెస్టు ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు అనేక మార్పులు చేయడంతో బాక్సింగ్‌డే టెస్టులో భారత్‌ ఎలా ఆడనుందనే విషయం ఆసక్తిగా మారింది. 

మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యే ముందు అడిలైడ్‌లో జట్టు సభ్యులతో మాట్లాడాడని తాత్కాలిక సారథి రహానె చెప్పాడు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని, ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు తమ శక్తి మేరకు రాణించాలని కోరాడన్నాడు. ఎన్నో ఏళ్లుగా కలిసికట్టుగా ఆడుతున్నామని, ఇప్పుడు కూడా అలాగే ఆడాలని కోహ్లీ సూచించినట్లు పేర్కొన్నాడు.

భారత జట్టు: అజింక్య రహానె (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, పంత్, జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, బుమ్రా

ఇవీ చదవండి..

ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా 

దుమారం రేపిన సన్నీ!

ఇదేం అంపైరింగో.. బంతి బ్యాట్‌కు‌ తాకినా..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని