ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆదాయం ఎంతో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ లాంటి మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించి అందరి చేతా శభాష్‌ అనిపించుకుంది బీసీసీఐ. ఏటా వేసవి కాలంలో భారత్‌లో నిర్వహించే...

Updated : 23 Nov 2020 12:42 IST

స్పష్టం చేసిన కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ లాంటి మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించి అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంది బీసీసీఐ. ఏటా వేసవి కాలంలో భారత్‌లో నిర్వహించే ఈ లీగ్‌.. కరోనా పరిస్థితుల ప్రభావంతో ఈసారి యూఏఈకి తరలివెళ్లింది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు 50 రోజులకి పైగా క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించింది. అయితే, ఎప్పుడూ అభిమానుల కేరింతలతో ఉత్సాహభరితంగా కనిపించే మైదానాలు ఈసారి ఎవరూ లేక వెలవెలబోయాయి. అయినా ఆ లోటు కనిపించకుండా నిర్వాహకులు వర్చువల్‌ పద్ధతిలో ఉత్సాహపరిచారు. ఇలాంటి‌ పరిస్థితుల్లో ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం సాధ్యమేనా అనుకునే తరుణంలో బీసీసీఐ దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని ఆర్జించిందని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు.

తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన ఆయన.. టోర్నీ నిర్వహణ, దాని ఆదాయంపై స్పందించాడు. ఈ 13వ సీజన్‌ నిర్వహించడంపై తొలుత అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ ప్రధాన కార్యదర్శి జైషా ధైర్యం చేసి ముందడుగు వేశారని చెప్పారు. ఇక చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో అప్పుడు కాస్త ఆలోచించామన్నారు. వారికి లక్షణాలు లేకపోవడంతో ఐసోలేషన్‌లో ఉంచామని, తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లంతా కోలుకున్నాక టోర్నీని దిగ్విజయంగా కొనసాగించినట్లు వివరించారు. అయితే, ఈ సీజన్‌ నిర్వహణ మొత్తంలో 35 శాతం ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. బీసీసీఐ సుమారు 4 వేల కోట్ల ఆదాయం పొందిందని, అలాగే గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ, డిజిటల్‌ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు. టోర్నీ జరిగినన్ని రోజులు అన్ని ఫ్రాంఛైజీల వారికి మొత్తం 30 వేల ఆర్టీ-పీసీఆర్‌ కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అరుణ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని