
సెహ్వాగ్ చెప్పిన ‘నటరాజన్’ ఐపీఎల్ కథ
పంజాబ్లోకి తీసుకుంటే విమర్శించారన్న వీరూ
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు యువ పేసర్ టి.నటరాజన్ టీమ్ఇండియాకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అతడి సత్తా తెలుసు కాబట్టే ఐపీఎల్ 2017 సీజన్లో పంజాబ్ జట్టులోకి తీసుకున్నానని పేర్కొన్నాడు. కానీ.. కనీసం దేశవాళీ క్రికెటైనా ఆడని ఆటగాడిని ఎందుకు తీసుకున్నావని విమర్శకులు తననప్పుడు ప్రశ్నించారని వెల్లడించాడు. పంజాబ్ జట్టులోని తమిళనాడు ఆటగాళ్లు చెప్పడం వల్లే అతడిని పరిశీలించానని స్పష్టం చేశాడు.
‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు అతడిని తీసుకున్నందుకు నేనెంతో సంతోషించాను. అతడు కనీసం దేశవాళీ క్రికెట్ అయినా ఆడలేదని అప్పుడు నన్ను విమర్శించారు. కేవలం టీఎన్పీఎల్ లీగులో ఆటతీరు చూసి అంత భారీ ధర ఎందుకు వెచ్చించావని ప్రశ్నించారు. డబ్బు గురించి నేను బాధపడలేదు. అతడిలో ప్రతిభ ఉందని నమ్మాను. అతడు అత్భుతమైన బౌలరని, డెత్ ఓవర్లలో కట్టుతప్పకుండా యార్కర్లు వేస్తాడని మా జట్టులోని తమిళనాడు ఆటగాళ్లు నాకు చెప్పారు’ అని వీరూ అన్నాడు.
‘నేను నటరాజన్ వీడియోలు చూశాను. మాకెవరూ డెత్ ఓవర్ల స్పెషలిస్టు లేకపోవడంతో వేలంలో అతడిని కొనుగోలు చేశాను. దురదృష్టవశాత్తు ఆ ఏడాది అతడి మోచేతికి గాయమైంది. దాంతో అన్ని మ్యాచులూ ఆడలేకపోయాడు. కానీ అతనాడిన మ్యాచులు మాత్రమే గెలిచి మేం మిగతావి ఓడిపోయాం. నటరాజన్ టీ20లకు ఎంపికవ్వడంతో అతడికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని కోరుకున్నా. కానీ ఆశ్చర్యంగా ముందుగా వన్డేల్లోనే అరంగేట్రం చేశాడు. ఏదైతేనేం.. అంతా మంచే జరిగింది. ఇలాగే నిలకడగా రాణిస్తూ అతడు టీమ్ఇండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి’ అని సెహ్వాగ్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టుకు నటరాజన్ ఎలాంటి బౌలింగ్ చేశాడో అందరికీ తెలిసిందే.