IPL 2021: చెన్నై x దిల్లీ.. ఫైనల్ పిలుస్తోంది
సీనియర్లతో నిండి ‘డాడీస్ ఆర్మీ’గా పేరు తెచ్చుకున్న జట్టు ఓ వైపు.. యువ ఆటగాళ్లతో ఉరకలెత్తుతున్న బృందం మరో వైపు! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన జట్టు ఒకటి.. గత మూడు సీజన్లుగా అద్భుత ప్రదర్శనతో
నేడే ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్
సీనియర్ల చెన్నైతో యువ దిల్లీ ఢీ
గెలిస్తే నేరుగా తుదిపోరుకు
ఓడినా మరో అవకాశం
దుబాయ్
రాత్రి 7.30 నుంచి
సీనియర్లతో నిండి ‘డాడీస్ ఆర్మీ’గా పేరు తెచ్చుకున్న జట్టు ఓ వైపు.. యువ ఆటగాళ్లతో ఉరకలెత్తుతున్న బృందం మరో వైపు! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన జట్టు ఒకటి.. గత మూడు సీజన్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమ్ ఇంకోటి.. ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టు అటు.. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడుతున్న జట్టు ఇటు! ఇప్పుడా రెండు జట్లు ఐపీఎల్ 14వ సీజన్లో కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఫైనల్లో చోటు కోసం తలపడుతున్నాయి. ఆదివారం తొలి క్వాలిఫయర్లో పోటీపడనున్న ఆ జట్లే.. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్.
మరి ఈ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టేదెవరో చూడాలి. ఓడిన జట్టుకు టైటిల్ పోరు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది.
భారత్లో మొదలై.. కరోనా కారణంగా వాయిదా పడి.. యూఏఈలో కొనసాగుతున్న ఐపీఎల్ 14వ సీజన్లో ఇక రసవత్తర దశ మొదలు కానుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్లతో క్రికెటానందం పొందిన అభిమానులు.. ఇప్పుడిక ప్లేఆఫ్స్లో అంతకుమించి కిక్కును ఆస్వాదించనున్నారు. ఈ సీజన్లో బలంగా కనిపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ తొలి క్వాలిఫయర్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. 14 మ్యాచ్ల్లో.. పదింట్లో గెలిచి 20 పాయింట్లు సాధించిన దిల్లీ అగ్రస్థానంతో.. 9 విజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే రెండో స్థానంతో లీగ్ దశను ముగించాయి. లీగ్ సాంతం ఈ రెండు జట్లు మెరుగ్గానే కనిపించాయి. అన్ని విభాగాల్లోనూ సత్తాచాటాయి. అయితే తొలి క్వాలిఫయర్లో సీఎస్కే కంటే దిల్లీ ఫేవరేట్గా కనిపిస్తోంది. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పట్టుదలతో ఉన్న దిల్లీ ప్రాణాలు పెట్టి ఆడుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. లీగ్ దశలో సీఎస్కేతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచింది. 2020 సీజన్ కూడా కలిపి చూసుకుంటే ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్ల్లో దిల్లీదే విజయం. కానీ చివరగా ప్లేఆఫ్స్లో (2019లో రెండో క్వాలిఫయర్) తలపడినపుడు మాత్రం సీఎస్కే గెలిచింది. ఈ సీజన్లో చివరి మూడు లీగ్ మ్యాచ్ల్లోనూ ధోనీసేన ఓడినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ప్రతికూల పరిస్థితులను దాటి విజయాలు సాధించడం ఆ జట్టుకు అలవాటే.
పట్టుదలతో..
తొలి ఐపీఎల్ టైటిల్ కోసం పట్టుదలతో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ గత కొన్నేళ్లుగా ఎంతో మెరుగైంది. వరుసగా మూడో సీజన్లోనూ ప్లేఆఫ్స్కు చేరింది. 2019లో రెండో క్వాలిఫయర్లో ఓడిన ఆ జట్టు.. గతేడాది ఫైనల్లో పరాజయం పాలైంది. గత రెండు సార్లు టైటిల్కు చేరువై దూరమైన ఆ జట్టు.. ఈ సారి మాత్రం ట్రోఫీ సొంతం చేసుకోవాలనే ధ్యేయంతో ఉంది. యువ వికెట్ కీపర్ పంత్ సారథ్యంలోని దిల్లీ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా జట్టుకు గొప్ప ఆరంభాలనిస్తున్నారు. ముఖ్యంగా ధనాధన్ ఇన్నింగ్స్లతో సాగుతోన్న ధావన్ (544) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. షా (401) కూడా నిలకడగా రాణిస్తున్నాడు. వీళ్లిద్దరూ మరోసారి జట్టుకు శుభారంభాన్ని అందిస్తే చెన్నైకి చిక్కులు తప్పవు. ఇక ఆ తర్వాత పంత్, శ్రేయస్ అయ్యర్, హెట్మయర్, స్టాయినిస్, అక్షర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. గత కొన్ని మ్యాచ్ల్లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే దిల్లీ ఆడింది. కానీ చెన్నైతో మ్యాచ్కు స్టాయినిస్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నట్లు పంత్ చెప్పాడు. ఈ నేపథ్యంలో స్టాయినిస్ జట్టులోకి వస్తే బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టుకు మేలవుతుంది. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అవేశ్ ఖాన్ (22)తో పాటు సఫారీ పేస్ ద్వయం రబాడ, నార్జ్తో కూడిన పేస్ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్షగా నిలుస్తోంది. అవేశ్ వికెట్ల వేటలో దూసుకెళ్తుండగా.. రబాడ, నార్జ్ తమ వేగంతో ప్రత్యర్థికి కళ్లెం వేస్తున్నారు. పవర్ప్లేలో, మధ్య ఓవర్లలో అక్షర్ (15) తన స్పిన్తో ఆకట్టుకుంటున్నాడు. ఏ పరిస్థితుల్లో ఎలాంటి బంతి వేయాలనే పూర్తి అవగాహన, అనుభవం ఉన్న సీనియర్ స్పిన్నర్ అశ్విన్తో ప్రత్యర్థులకు ముప్పు తప్పదు. మరోవైపు జట్టుకు కొండంత బలంగా మారిన కోచ్ రికీ పాంటింగ్ చెన్నైతో మ్యాచ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తాడోననే ఆసక్తి కలుగుతోంది. దుబాయ్ స్టేడియంలో దిల్లీకి మంచి రికార్డు ఉండడం కలిసొచ్చే అంశం.
పట్టేయాలని..
2020 ముందు వరకూ ఆడిన అన్ని సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరిన సీఎస్కే.. గతేడాది మాత్రం పేలవ ప్రదర్శనతో తొలిసారి కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ జట్టుపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. కానీ ఈ సీజన్లో సరికొత్తగా అడుగుపెట్టిన చెన్నై.. ఆ సందేహాలను పటాపంచలు చేసి పాత సీఎస్కేను గుర్తు చేస్తూ అదరగొడుతోంది. నాలుగో టైటిల్ను పట్టేయాలని చూస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్ భారం ప్రధానంగా ఓపెనర్లు డుప్లెసిస్ (546), రుతురాజ్ (533)లపైనే ఉంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డుప్లెసిస్ రెండో స్థానంలో ఉన్నాడు. దిల్లీతో మ్యాచ్లోనూ సీఎస్కేకు ఈ ఓపెనర్లు కీలకం కానున్నారు. అయితే షార్ట్పిచ్ బంతులు ఎదుర్కోవడంలో బలహీనత ప్రదర్శిస్తున్న రుతురాజ్.. నార్జ్, రబాడ్ బంతులను ఎలా ఆడతాడో చూడాలి. మిడిలార్డర్లో మొయిన్ అలీ, అంబటి రాయుడు అవసరమైన సమయంలో జట్టును ఆదుకుంటున్నారు. జడేజా మెరుపు ముగింపులు ఇవ్వడంతో పాటు స్పిన్తోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక కెప్టెన్ ధోని ఫామ్ ఒక్కటే జట్టును కలవరపరిచే అంశం. సారథిగా తిరుగులేని వ్యూహాలతో జట్టును నడిపించే అతను.. బ్యాట్తోనూ చెలరేగితే చూడాలనేది అభిమానుల ఆశ. మరోవైపు దిల్లీతో మ్యాచ్లో రైనా, ఉతప్పలో ఎవరిని ఆడిస్తారనే సందేహం నెలకొంది. ప్రత్యర్థి జట్టులో అశ్విన్ ఉండడం వల్ల లెఫ్టాండర్ అయిన రైనాను బెంచ్కే పరిమితం చేస్తారా? లేదా కీలక మ్యాచ్ కావడంతో జట్టులో చోటిస్తారా? అన్నది చూడాలి. బ్రావో ఎప్పుడూ నమ్మదగ్గ ఆల్రౌండరే. శార్దూల్ (18), దీపక్ చాహర్, హేజిల్వుడ్ పేస్ త్రయం దిల్లీ బ్యాటర్లకు సవాలు విసరాలనే పట్టుదలతో ఉంది. ఈ పేసర్లలో నిలకడ లేకపోవడం.. కచ్చితంగా వికెట్లు తీస్తారనే నమ్మకం కలిగించకపోవడం సీఎస్కేను ఆందోళన పరిచే అంశం. ఓ మ్యాచ్లో గొప్పగా రాణిస్తున్న శార్దూల్, దీపక్ మరో మ్యాచ్లో తుస్సుమనిపిస్తున్నారు. ఇక లీగ్ దశలో చివరి మూడు మ్యాచ్ల్లో ఓడిన చెన్నై ఆ ఓటములకు కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
పిచ్ ఎలా ఉంది?
దుబాయ్ పిచ్ బ్యాటింగ్కు కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక్కడ జరిగిన గత ఏడు మ్యాచ్ల్లో ఒక్క ఇన్నింగ్స్లోనూ స్కోరు 170 దాటలేదు. బౌలర్లకు ఎక్కువగా సహకరించే ఆస్కారముంది. ఇక టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన 11 మ్యాచ్ల్లో ఎనిమిది సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండడమే అందుకు కారణమని చెప్పొచ్చు.
జట్లు (అంచనా)
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, ధావన్, పంత్, శ్రేయస్, హెట్మయర్, స్టాయినిస్/రిపల్ పటేల్, అక్షర్, అశ్విన్, రబాడ, నార్జ్, అవేశ్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఉతప్ప/రైనా, ధోని, జడేజా, బ్రావో, శార్దూల్, దీపక్, హేజిల్వుడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్