భారత్‌×పాక్ సిరీస్ తప్పనిసరి కాదు‌: ఐసీసీ

ప్రతిష్ఠాత్మక టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆశయాన్ని సాధించలేకపోయామని ఐసీసీ నూతన ఛైర్మన్‌ గ్రెగ్ బార్‌క్లే అన్నాడు. సాంప్రదాయక ఫార్మాట్‌ను అందరిలోకి తీసుకెళ్లి దానిపై ఆసక్తి పెంచాలనే

Published : 30 Nov 2020 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రతిష్ఠాత్మక టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆశయాన్ని సాధించలేకపోయామని ఐసీసీ నూతన ఛైర్మన్‌ గ్రెగ్ బార్‌క్లే అన్నాడు. సాంప్రదాయక ఫార్మాట్‌ను అందరిలోకి తీసుకెళ్లి దానిపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహించామని, కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో అది విజయవంతంకాలేదని తెలిపాడు. మహమ్మారి వల్ల కొన్ని టెస్టు సిరీస్‌లు రద్దు కావడంతో ఫైనల్‌కు చేరే జట్లను గెలుపుశాతం ఆధారంగా నిర్ణయిస్తామని ఇటీవల ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘‘టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని లోపాలను కొవిడ్‌ హైలైట్ చేస్తుంది. అయితే ఛాంపియన్‌షిప్‌ను టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచడానికి రూపొందించాం. టెస్టు మ్యాచ్‌ల్లో హోరాహోరీ పోటీలతో ప్రేక్షకులను ఆకర్షించాలనుకున్నాం. కానీ ఇది సాధ్యం కాలేదనిపిస్తోంది. కొవిడ్‌-19 వల్ల జరగని మ్యాచ్‌లకు పాయింట్లు ఇవ్వాలని వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డాను. కాగా, అలా చేస్తే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆశయాన్ని అందుకోలేం. షెడ్యూల్‌పై మరోసారి దృష్టిసారించాలి. ఆటగాళ్లకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు వేయాలి’’ అని బార్‌క్లే తెలిపాడు.

ఐసీసీలో భారత క్రికెట్‌ పాత్ర గురించి బార్‌క్లే మాట్లాడాడు. ‘‘ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ ఎంతో ముఖ్యం. కుటుంబాల్లో ఉన్నట్లు మాలోనూ భేదాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఐసీసీకి ‘భారత క్రికెట్’ ఎంతో కీలకం. భిన్నాభిప్రాయలు ఉంటే చర్చించుకుని ముందుకు సాగుతాం’’ అని అన్నాడు. భారత్×పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు గురించి మాట్లాడుతూ.. టీమిండియా, పాక్‌ సిరీస్‌ తప్పనిసరి కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటున్నామని అన్నాడు. ఇక ఐపీఎల్, బీబీఎల్, సీపీఎల్‌ నాణ్యమైన క్రికెట్‌తో వాణిజ్యపరంగా గొప్పగా సాగుతున్నాయని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని