దాదా, ధోనీ కలయికే రోహిత్‌ శర్మ

ముంబయి టీమ్‌ ఐదోసారి టీ20 లీగ్‌ ఛాంపియన్‌గా అవతరించడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ.. సౌరభ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనీలాంటి...

Updated : 13 Nov 2020 16:17 IST

ముంబయి కెప్టెన్‌ను ప్రశంసించిన ఇర్ఫాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి టీమ్‌ ఐదోసారి టీ20 లీగ్‌ ఛాంపియన్‌గా అవతరించడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. సౌరభ్‌ గంగూలీ, ఎంఎస్‌ ధోనీ లక్షణాలను కలబోస్తే ముంబయి కెప్టెన్‌ రోహిత్‌శర్మ  అవుతారని ప్రశంసించాడు. భారత జట్టు మాజీ సారథుల్లాగే రోహిత్‌ సైతం బౌలర్లపై నమ్మకముంచుతాడని చెప్పాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఇర్ఫాన్‌ ఇలా చెప్పుకొచ్చాడు. 

‘ధోనీ, గంగూలీల కలయికే రోహిత్‌శర్మ. దాదా తన బౌలర్లను నమ్మకొనే ముందుకు సాగాడు. ధోనీ సైతం అలాగే చేశాడు. కానీ, ఎప్పటికప్పుడు అనూహ్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక రోహిత్‌ ఆటగాళ్లను వినియోగించే తీరు క్లాసిక్‌గా ఉంటుంది. అందుకు సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆడించడమే నిదర్శనం. ఏ కెప్టెన్‌ అయినా అతడి స్థానంలో ఒక పేసర్‌ను తీసుకుంటాడు. రోహిత్ మాత్రం తెలివిగా వ్యవహరించాడు. దాంతోనే అతడు స్పష్టతతో నిర్ణయాలు తీసుకొంటున్నాడని అర్థమవుతోంది. అలాగే ఈ టోర్నీలో ఒక మ్యాచ్‌ ఓడిపోయే స్థితిలో ఉండగా అనూహ్యంగా బుమ్రాకు 17వ ఓవర్‌లో బంతి ఇచ్చాడు. సహజంగా బుమ్రాకు 18వ ఓవర్‌ కేటాయిస్తాడు. దాంతో మ్యాచ్‌ ముంబయికి అనుకూలంగా మారింది. మరోవైపు పొలార్డ్‌ను కూడా మొదట్లో బౌలింగ్‌కు ఉపయోగించలేదు. వికెట్లు సహకరించడంతో అతడికి బంతి అందించాడు’ అని పఠాన్‌ ముంబయి సారథి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని