హార్దిక్‌పాండ్య మనసులు గెలిచాడు: కనేరియా

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌, జీవితకాల నిషేధానికి గురైన ఆటగాడు డానిష్‌ కనేరియా ప్రశంసించాడు. గతవారం ఆస్ట్రేలియాపై భారత్‌ మూడు టీ20ల...

Published : 14 Dec 2020 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌, జీవితకాల నిషేధానికి గురైన ఆటగాడు డానిష్‌ కనేరియా ప్రశంసించాడు. గతవారం ఆస్ట్రేలియాపై భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో పాండ్య అద్భుతంగా రాణించడంతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. అతడికిచ్చిన అవార్డును యువ పేసర్‌ నటరాజన్‌కు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ బహుకరించాడు. నటరాజన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సిరీస్‌లోనే మంచి ప్రదర్శన చేశాడని ప్రోత్సహిస్తూ దాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కనేరియా ఓ ట్వీట్‌ చేసి పాండ్యను మెచ్చుకున్నాడు. 

హార్దిక్‌ తన ప్రవర్తనతో అందరి మనసులూ గెలిచాడన్నాడు. నటరాజన్‌కు పాండ్య అందజేసిన ‘మ్యాన్‌ ఆఫ్‌ సిరీస్‌’ అవార్డు ఫొటోను పంచుకొని ఇలా పేర్కొన్నాడు. ‘ఇంతకన్నా గొప్ప ఫొటో ఉండదు. పాండ్య ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికైనా దాన్ని యువపేసర్‌కు అందజేశాడు. దీంతో నటరాజన్‌ సంతోషించడమే కాకుండా ఎంతో స్ఫూర్తిపొంది ఉంటాడు. మా ఆటగాళ్లలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేశారేమో మీరే ఊహించుకోండి’ అని పాండ్యను మెచ్చుకుంటూనే పాకిస్థాన్‌ ఆటగాళ్లని విమర్శించాడు. ఇదిలా ఉండగా, కనేరియా 2012లో ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ ఆడుతూ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో చిక్కుకున్నాడు. దీంతో అప్పటి నుంచీ అతడిపై జీవిత కాల నిషేధం కొనసాగుతోంది. అయితే, తనకు దేశవాళి క్రికెట్‌ ఆడటానికి అనుమతి ఇవ్వాలని పలుమార్లు పీసీబీని సంప్రదించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కనేరియా వీలుచిక్కినప్పుడల్లా పాక్‌ క్రికెటర్ల తీరును సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతున్నాడు. 
ఇవీ చదవండి..

మరిన్ని డబుల్‌ ధమాకాలు రానున్నాయి: రోహిత్‌  
బ్యాట్‌తో చుక్కలు.. బంతితో నిప్పులు..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని