
కోహ్లీ గైర్హాజరీ రోహిత్కు లాభం
ఇంటర్నెట్డెస్క్: పితృత్వ సెలవులతో ఆస్ట్రేలియా సిరీస్లో చివరి మూడు టెస్టులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వడం వైస్కెప్టెన్ రోహిత్ శర్మకు కలిసొస్తుందని ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్గ్రాత్ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్లలో ఎన్నో ఘనతలు సాధించిన హిట్మ్యాన్ సుదీర్ఘఫార్మాట్లో పెద్దగా సత్తాచాటలేదని, కోహ్లీ గైర్హాజరీతో ఆ లోటును తీర్చుకుంటాడని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
‘‘రోహిత్ శర్మ నాణ్యమైన బ్యాట్స్మన్. కానీ, టెస్టుల్లో గొప్పగా ఏమీ సాధించలేదు. ఈ సారి తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లడం రోహిత్కు కలిసొస్తుంది. కోహ్లీ గైర్హాజరీలో అతడు ఒక్కడే రాణిస్తాడని భావించలేం. అజింక్య రహానె, పుజారా, కేఎల్ రాహుల్తో భారత్కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరిలో ఎవరైనా ఆస్ట్రేలియా సిరీస్లో తమదైన ముద్ర వేయొచ్చు. అది రోహిత్ చేస్తాడని భావిస్తున్నా’’ అని మెక్గ్రాత్ అన్నాడు.
కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో విరాట్ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్కు తిరిగొస్తాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యాడు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. నవంబర్ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.