దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ముగ్గురికి కరోనా

దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టులో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 27 నుంచి ప్రిటోరియాలో...

Published : 25 Jul 2020 23:20 IST

జోహెనస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టులో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 27 నుంచి ప్రిటోరియాలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరు క్రికెటర్లతో పాటు ఒక సహాయక సిబ్బందికి వైరస్‌ సోకినట్లు పేర్కొంది. ఆ ముగ్గురు పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారని, ఇప్పుడైతే తేలిక పాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని వివరించింది. అలాగే వారిని నిరంతరం తమ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారని చెప్పింది. 

సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే ఆగస్టు 16 నుంచి జరగబోయే రెండో దఫా శిక్షణా శిబిరానికి మరోసారి అందరికి పరీక్షలు జరపనున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరి, మార్చిలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈ దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌ వరకూ వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కంగారూల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 134/5 స్కోర్‌ చేసింది. అనంతరం వర్షం కురవడంతో డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98గా సవరించారు. దీంతో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేసి ఓటమిపాలైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని