Team India: మేల్కోకపోతే కష్టమే

టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో.. గత రికార్డు నేపథ్యంలో దాయాదిపై తిరుగుండదు.. భారీ విజయంతో టీమ్‌ఇండియా టోర్నీని ప్రారంభించడం...

Updated : 26 Oct 2021 05:59 IST

టీమ్‌ఇండియా సత్తాచాటాల్సిందే

ఈనాడు క్రీడావిభాగం

టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో.. గత రికార్డు నేపథ్యంలో దాయాదిపై తిరుగుండదు.. భారీ విజయంతో టీమ్‌ఇండియా టోర్నీని ప్రారంభించడం ఖాయమేనంటూ ఏర్పడ్డ అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. గెలవాలన్న కసి.. పక్కా ప్రణాళికతో మైదానంలో అడుగుపెట్టిన ప్రత్యర్థి.. భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. టీ20, వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి తన చేతిలో టీమ్‌ఇండియాకు ఓటమి రుచి చూపించింది. ఈ ఓటమి దేశవ్యాప్తంగా అభిమానుల ఆవేదనకు కారణమవడమే కాకుండా.. ఇప్పుడీ టోర్నీలో భారత ప్రయాణాన్ని కఠినంగా మార్చింది. పాక్‌తో ఓటమి బాధను పక్కకుపెట్టి.. వైఫల్యాలపై దృష్టి సారించి.. ఇప్పటికైనా మేల్కొని రాబోయే మ్యాచ్‌ల్లో జట్టు సత్తాచాటాలి. లేదంటే మరోసారి కప్పు అందని ద్రాక్షే అవుతుంది.

తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ గెలిస్తే.. టోర్నీలో ఆ జోష్‌ వేరుగా ఉండేది. ఆ విజయం కచ్చితంగా జట్టుకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాచ్‌లో ఓటమి పలకరించడంతో జట్టు పరిస్థితి ఇబ్బందిగా మారింది. అనూహ్య పరాజయంతో టోర్నీని ఆరంభించిన కోహ్లీసేనకు.. ఇక ప్రతి మ్యాచ్‌ కీలకమే.

గెలుపే లక్ష్యంగా..: గ్రూప్‌- 2లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌,  న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉన్నాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి. తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఇప్పుడు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిందే! ఎందుకంటే ఈ గ్రూపులో అఫ్గానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ రూపంలో మూడు బలహీనమైన జట్లే ఉన్నాయి. సంచలనాలు ఏమైనా జరిగితే తప్ప వీటిపై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. న్యూజిలాండ్‌పై భారత్‌ గెలిచి.. ఆ తర్వాత ఈ మూడు జట్లపై నెగ్గితే 8 పాయింట్లు వస్తాయి. ఒకవేళ న్యూజిలాండ్‌ చేతిలో ఓడితే మాత్రం.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ఆరు పాయింట్లే దక్కుతాయి. అప్పుడు తొలి రెండు స్థానాల్లో నిలవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్‌పై గెలిచిన పాక్‌.. ఒకవేళ కివీస్‌తో ఓడినా..ఆ మూడు చిన్న జట్లపై విజయాలు సాధించి 8 పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంది. భారత్‌పై కివీస్‌ గెలిస్తే.. పాక్‌తో పరాజయం పాలైనా.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి 8 పాయింట్లు సాధించే ఆస్కారం ఉంది. అప్పుడు పాక్‌, కివీస్‌ చెరో 8 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలవగా.. భారత్‌ మాత్రం 6 పాయింట్లతో సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జట్టు జాగ్రత్త పడాలి.

కూర్పు కుదరాలి..: టీమ్‌ఇండియా ప్రధానంగా కూర్పు సమస్యను అధిగమించాల్సి ఉంది. బౌలింగ్‌ చేయలేనప్పుడు హార్దిక్‌ పాండ్యను ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు? అతని స్థానంలో ఇషాన్‌ కిషాన్‌ను ఆడించవచ్చు కదా అనే ప్రశ్నలకు జట్టు సమాధానం చెప్పాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో ఆరో బౌలర్‌ లేక జట్టు ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ స్థానంలో బ్యాట్‌, బంతితో రాణించే శార్దూల్‌ను తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలి. లేదంటే ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న భువనేశ్వర్‌ స్థానంలో శార్దూల్‌ను తీసుకుని హార్దిక్‌కు బదులుగా ఇషాన్‌ను ఆడించాలనే వాదన కూడా వినిపిస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని విజయాలు అందించే కూర్పును మైదానంలో దించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని