
T20 World cup: కోహ్లీపై ఒత్తిడి తగ్గాలంటే..!
సిడ్నీ: మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ చుట్టూ టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఇన్నింగ్స్ను నిర్మించుకోవాలని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ సూచించాడు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గించడానికి ఇది ఎంతగానో దోహద పడుతుందని తెలిపాడు. ‘‘ఆటగాళ్లు, అనుభవం ప్రకారం టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ గట్టి పోటీదారు. నా దృష్టిలో మాత్రం టీమ్ఇండియానే ఫేవరెట్. అన్ని ఫార్మాట్లలో భారత్ ఆధిపత్యం గురించి ఆలోచిస్తుండొచ్చు. కాని ఐపీఎల్తో యువ ఆటగాళ్లు ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. మంచి పేస్, బ్యాటింగ్తో ఎదురులేకుండా ఉన్నారు. ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ అత్యధికంగా పరుగులు సాధిస్తాడని భావిస్తున్నా. ఐపీఎల్ను అతడు గొప్పగా ముగించాడు. టీమ్ఇండియా బ్యాటింగ్కు అతను మూలస్తంభంగా నిలిస్తే మిగతా ఆటగాళ్లు ఇన్నింగ్స్ను నిర్మించుకోవచ్చు. రాహుల్ పరుగులు సాధిస్తుంటే కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుంది. కోహ్లి తన సహజ సిద్ధమైన ఆటను ఆడేందుకు అవకాశం లభిస్తుంది. బహుశా పొట్టి ఫార్మాట్లో సారథిగా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కాబట్టి అతడు గొప్పగా ముగించాలని కోరుకుంటాడు’’ అని లీ పేర్కొన్నాడు.