IPL 2021: ప్లేఆఫ్స్‌లో దిల్లీ!

జోరుమీదున్న దిల్లీ మరోసారి అదరగొట్టింది. తక్కువ స్కోరే చేసినా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాజస్థాన్‌కు కళ్లెం వేస్తూ ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న దిల్లీ.. ప్లేఆఫ్స్‌ చేరినట్లే. రాజస్థాన్‌కు ఇది అయిదో ఓటమి.

Updated : 26 Sep 2021 07:07 IST
రాణించిన శ్రేయస్‌
రాజస్థాన్‌ పరాజయం
ఎనిమిదో విజయంతో అగ్రస్థానానికి

జోరుమీదున్న దిల్లీ మరోసారి అదరగొట్టింది. తక్కువ స్కోరే చేసినా.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాజస్థాన్‌కు కళ్లెం వేస్తూ ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న దిల్లీ.. ప్లేఆఫ్స్‌ చేరినట్లే. రాజస్థాన్‌కు ఇది అయిదో ఓటమి.

అబుదాబి

దిల్లీ క్యాపిటల్స్‌ మురిసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (43; 32 బంతుల్లో 1×4, 2×6), హెట్‌మయర్‌ (28; 16 బంతుల్లో 5×4) రాణించడంతో మొదట దిల్లీ 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్‌ (2/22),    సకారియా (2/33) ఆ జట్టును కట్టడి చేశారు. ఛేదనలో రాజస్థాన్‌ 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. సంజు శాంసన్‌ (70 నాటౌట్‌; 53 బంతుల్లో 8×4, 1×6) రాణించినా.. ఫలితం లేకపోయింది. నార్జ్‌ (2/18), అవేష్‌ ఖాన్‌ (1/29), అశ్విన్‌ (1/20), రబాడ (1/26)ను రాజస్థాన్‌ను దెబ్బతీశారు. శ్రేయస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

శాంసన్‌ నిలిచినా!: లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా.. ఛేదనలో రాజస్థాన్‌ తీవ్రంగా తడబడింది. అవేష్‌, నార్జ్‌, అశ్విన్‌, రబాడల సూపర్‌ బౌలింగ్‌తో 12 ఓవర్లలో 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే లివింగ్‌స్టోన్‌ను ఔట్‌ చేయడం ద్వారా అవేష్‌ ఆ జట్టు పతనాన్ని ఆరంభించాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ ఏ దశలోనూ బ్యాట్‌ను ఝళిపించలేకపోయింది. శాంసన్‌ నిలిచినా.. ధాటిగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. అయిదో వికెట్‌ పోయాక.. తెవాతియా (19) శాంసన్‌కు అండగా నిలిచాడు. కానీ వారికి దిల్లీ బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. బౌండరీలు ఎక్కువగా రాకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ ఓవర్‌ ఓవర్‌కూ బాగా పెరుగుతూ పోయింది. చివరి 5 ఓవర్లలో 73 పరుగులు అవసరంగా కాగా.. దిల్లీ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. 18 ఓవర్లయ్యేటప్పటికి తెవాతియానూ కోల్పోయిన రాజస్థాన్‌.. 101/6 నిలిచింది. చివరి రెండు ఓవర్లలో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు ఓటమి ఖాయమైపోయింది.

దిల్లీకి కళ్లెం: మొదట దిల్లీని రాజస్థాన్‌ కట్టడి చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన  దిల్లీ.. త్వరగానే ఓపెనర్లు ధావన్‌  (8), పృథ్వీ షా (10)ను కోల్పోయింది. పవర్‌ ప్లే ఆఖరికి దిల్లీ 36/2తో    నిలిచింది. శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ (24) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ కుదురుకుని జోరు పెంచడానికి సిద్ధమవుతున్న దశలో దిల్లీని ముస్తాఫిజుర్‌ దెబ్బతీశాడు. 12వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అతడు.. పంత్‌ను బౌల్డ్‌ చేయడంతో 62 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 14వ ఓవర్లో శ్రేయస్‌ను తెవాతియా వెనక్కి పంపడంతో దిల్లీ   90/4తో నిలిచింది. ఆ తర్వాత హెట్‌మయర్‌ కాసేపే ఉన్నా బ్యాట్‌ ఝుళిపించాడు. త్యాగి వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. తర్వాతి ఓవర్లోనే అతడు నిష్క్రమించాడు. దిల్లీ చివరి మూడు  ఓవర్లలో 32 పరుగులు చేసి.. 150 దాటగలిగింది.

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లివింగ్‌స్టోన్‌ (బి) సకారియా 10; శిఖర్‌ ధావన్‌ (బి) త్యాగి 8; శ్రేయస్‌ అయ్యర్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తెవాతియా 43; రిషబ్‌ పంత్‌ (బి) ముస్తాఫిజుర్‌ 24; హెట్‌మయర్‌ (సి) సకారియా (బి) ముస్తాఫిజుర్‌ 28; లలిత్‌ యాదవ్‌ నాటౌట్‌ 14; అక్షర్‌ పటేల్‌ (సి) మిల్లర్‌ (బి) సకారియా 12; అశ్విన్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154;

వికెట్ల పతనం: 1-18, 2-21, 3-83, 4-90, 5-121, 6-142;

బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-22-2; లొమ్రార్‌ 1-0-5-0; సకారియా 4-0-33-2; కార్తీక్‌ త్యాగి 4-0-40-1; శాంసి 4-0-34-0; తెవాతియా 3-0-17-1

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: లివింగ్‌స్టోన్‌ (సి) పంత్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 1; యశస్వి జైస్వాల్‌ (సి) పంత్‌ (బి) నార్జ్‌ 5; శాంసన్‌ నాటౌట్‌ 70; మిల్లర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 7; లొమ్రార్‌ (సి) అవేష్‌ ఖాన్‌ (బి) రబాడ 19; రియాన్‌ పరాగ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 2; తెవాతియా (సి) హెట్‌మయర్‌ (బి) నార్జ్‌ 9; శాంసి నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121;

వికెట్ల పతనం: 1-6, 2-6, 3-17, 4-48, 5-55, 6-99;

బౌలింగ్‌: అవేష్‌ ఖాన్‌ 4-0-29-1; నార్జ్‌ 4-0-18-2; అశ్విన్‌ 4-0-20-1; రబాడ 4-0-26-1; అక్షర్‌ పటేల్‌ 4-0-27-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని