కోహ్లీసేన.. పొట్టి క్రికెట్టైనా గెలుస్తారా!

మూడు వన్డేల సిరీస్‌ను 1-2 చేజార్చుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్‌ సమరానికి సిద్ధమైంది. ఆఖరి వన్డేలో గెలిచిన మనుక ఓవల్‌లోనే మొదటి టీ20లో తలపడనుంది. తొలి పోరులోనే విజయం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని గట్టి...

Published : 03 Dec 2020 17:51 IST

శుక్రవారం ఆసీస్‌తో తొలి టీ20 పోరు

యువకుల రాకతో టీమ్‌ఇండియా జోరు

కాన్‌బెర్రా: మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్‌ సమరానికి సిద్ధమైంది. ఆఖరి వన్డేలో గెలిచిన మనుక ఓవల్‌లోనే మొదటి టీ20లో తలపడనుంది. తొలి పోరులోనే విజయం సాధించి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది. వన్డేల్లో అనేక విభాగాల్లో ఇబ్బందులు పడటంతో టీమ్‌ఇండియా కూర్పు కుదర్లేదు. ప్రస్తుతం యువకుల రాక.. ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటంతో 20 ఓవర్ల ఫార్మాట్లో పటిష్ఠంగానే కనిపిస్తోంది. ఆసీస్‌పై గత రెండు టీ20 సిరీసులు గెలవలేకపోయిన కోహ్లీసేన ఈసారైనా సత్తా చాటేనా!


నట్టూ అరంగేట్రం!

కరోనా మహమ్మారికి ముందు కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌తో పొట్టి క్రికెట్‌ సిరీసులో తలపడుతోంది. యువ ఆటగాళ్లు వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌ రాకతో బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారింది. కంగారూలతో ఆఖరి వన్డేలో నట్టూ కొన్ని పరుగులు ఎక్కువే ఇచ్చినా తనదైన యార్కర్లతో సత్తా చాటాడు. అతడి టీ20 అరంగేట్రం ఖాయమే అనిపిస్తోంది. ఇక ఐపీఎల్‌లో పవర్‌ప్లే, మధ్య ఓవర్లలో సుందర్‌ను కోహ్లీ వ్యూహాత్మకంగా వాడుకున్నాడు. బ్యాటింగ్‌తోనూ అతడు జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇది జట్టుకు లాభించేదే.  బ్యాటుతో పరుగుల వరద పారిస్తున్న హార్దిక్‌ పాండ్య పరిమిత స్పెల్‌తో ఆకట్టుకోగలడు! ఇక జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి షమి, దీపక్‌లో ఎవరు కొత్త బంతిని పంచుకుంటారో చూడాలి. మనుక ఓవల్‌ స్పిన్నర్లకూ సహకరిస్తుండటంతో పుంజుకోవాలని యుజ్వేంద్ర చాహల్‌ పట్టుదలగా ఉన్నాడు.


ఓపెనర్‌గా రాహుల్‌

బ్యాటింగ్ పరంగా టీమ్‌ఇండియా ఫర్వాలేదనిపిస్తోంది. వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌.. ధావన్‌తో కలిసి తనకిష్టమైన ఓపెనింగ్‌లో రావొచ్చు. ఐపీఎల్‌ తరహాలో వీలైతే 20 ఓవర్లూ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో ఉన్నాడు. అతడు ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ సైతం నాలుగో స్థానంలో రాణిస్తే తిరుగుండదు. హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా బ్యాటు, బంతితో కీలకంగా మారే అవకాశముంది. ఇక మయాంక్‌ అగర్వాల్‌, మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.


వార్నర్‌ లేకపోవడం లోటే

ఆతిథ్య ఆస్ట్రేలియా వన్డే, టీ20లకు ఒకే జట్టు ప్రకటించింది. వారిలో కొందరు గాయాల పాలైనప్పటికీ తొలి టీ20లో భారత్‌ను ఓడించాలనే దృఢనిశ్చయంతో మిగిలినవారు ఉన్నారు. స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ లేకపోవడం పెద్ద లోటే. ఫామ్‌లో ఉన్న ఆరోన్‌ ఫించ్‌తో మార్నస్‌ లబుషేన్‌ ఓపెనింగ్‌ చేయొచ్చు. బిగ్‌బాష్‌లో ఓపెనర్‌గా మెరుపులు మెరిపించిన స్టాయినిస్‌ సైతం అందుబాటులోనే ఉన్నాడు. అయితే అతడికి చిన్న గాయంకావడంతో ఆడటం అనుమానమే. ఆఖరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న మిచెల్‌ స్టార్క్‌ రావడంతో ఆసీస్‌బౌలింగ్‌ మరింత పటిష్టం కానుంది. ఇక స్టీవ్‌స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వీరోచిత ఫామ్‌లో ఉండటం టీమ్‌ఇండియాకు నష్టం కలిగించే అంశమే. వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ కేరీ సైతం ప్రమాదకరమే.


అప్పుడేం జరిగిందంటే

టీ20ల్లో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియాకు మెరుగైన రికార్డే ఉంది. ఈరెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 11-8 తేడాతో భారత్‌దే పైచేయి. విజయాల శాతం 57.89. అయితే ఈ సిరీసుకు ముందు  జరిగిన రెండు సిరీసుల్లోనూ కోహ్లీసేనకు మంచి ఫలితాలు రాలేదు. 2019 ఫిబ్రవరిలో ఉపఖండంలో ఆసీస్‌ పర్యటించింది. రెండు మ్యాచులు ఆడితే రెండూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. దానికి ముందు ఆసీస్‌లో పర్యటించిన టీమ్‌ఇండియా 3 టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇక శుక్రవారం మ్యాచ్‌ జరిగే మనుక ఓవల్‌ బౌలర్లు, బ్యాటర్లకు అనుకూలించనుంది.


జట్లు ఇవే

భారత్: విరాట్‌ కోహ్లీ (కె), శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వి), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌

ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌ (కె), సీన్‌ అబాట్‌, ఆస్టన్‌ ఏగర్‌, అలెక్స్‌ కేరీ (వి), కామెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, మోజెస్‌ హెన్రిక్స్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, డేనియెల్‌ సామ్స్‌, రిచర్డ్‌సన్‌, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, స్టాయినిస్‌, మాథ్యూవేడ్‌, డీఆర్సీ షార్ట్‌, ఆడమ్‌ జంపా

ఇవీ చదవండి
బుమ్రా ఇలా అయ్యాడేంటి?
శార్దూల్‌.. ఏంటీ ఆవేశం!

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని