Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్‌

యో-యో టెస్టు(Yo-Yo Test)పై మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌(Virender Sehwag) విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్లు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించాడు.

Updated : 21 Mar 2023 17:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ.. ‘యో-యో’ టెస్టు(Yo-Yo Test)ను ఇటీవల బీసీసీఐ(BCCI) తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎంపిక ప్రక్రియలో డెక్సా(Dexa)(బోన్‌ స్కాన్‌ టెస్టు)ను తప్పని సరి చేసింది. అయితే ఈ పరీక్షలపై మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌(Virender Sehwag) మరోసారి విమర్శలు గుప్పించాడు. తాము క్రికెట్‌ ఆడే సమయంలో యో-యోను తప్పనిసరి చేసి ఉంటే.. చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు టీమ్‌ఇండియాలో భాగమయ్యేవారు కాదని పేర్కొన్నాడు.

‘యో-యో టెస్టులో విఫలమైతే.. టీమ్‌లో మీకు చోటు దక్కదు. మా సమయంలో ఇలాంటి పరీక్షలు పెట్టి ఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిల్‌ అయ్యేవాళ్లు. దీంతో వారు టీమ్‌ఇండియాకు దూరమయ్యేవారు’ అంటూ సెహ్వాగ్‌ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

‘మేం క్రికెట్‌ ఆడే సమయంలో.. నైపుణ్యాలపైనే దృష్టి ఉండేది. మ్యాచ్‌లను ఎవరు గెలిపిస్తారు..?ఎవరు బాగా రాణిస్తారు లేదా ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు? ఇలాంటి విషయాలపైనే దృష్టి ఉండేది. మీకు బాగా పరుగెత్తే వారు కావాలంటే.. వారిని మారథాన్‌లలో నడిపించండి. వారు క్రికెట్‌ ఆడాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని నేను నమ్ముతాను’ అంటూ సెహ్వాగ్‌ వివరించాడు.

ఆటగాళ్లంతా నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలని.. జిమ్‌లలో వెయిట్‌లిఫ్టింగ్‌లపై కాదని సెహ్వాగ్‌ సూచించాడు. జిమ్‌లలో చేసే కసరత్తులతో గాయాలబారిన పడే అవకాశముందని చెప్పాడు. ‘మా సమయంలో బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఏదైనా.. ప్రాక్టీస్‌ చేయడం, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి ఉండేది. కెరీర్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దుకునేందుకు జిమ్‌ ముఖ్యమైనదే.. అయితే అది ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటుంది. మీ శరీరం సహకరిస్తే చేయండి. మీకు ఇతర సమస్యలుంటే.. జిమ్‌కు పరిమితులు విధించండి. నైపుణ్యాలే ఇక్కడ ముఖ్యం’ అంటూ సెహ్వాగ్‌ తన అభిప్రాయాలను తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని