WTC Finals: ఛాంపియన్‌షిప్‌ కన్నా ఇంగ్లాండ్‌పై గెలవాలి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ లేదా ఇంగ్లాండ్‌ సిరీస్‌.. ఈ రెండింటిలో టీమ్‌ఇండియా ఏదైనా ఒక్కదాంట్లోనే విజయం సాధించాలని కోరుకోవాలని తనని అడిగితే ఇంగ్లాండ్‌ సిరీస్‌కే ఓటేస్తానని మాజీ ఓపెనర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు...

Updated : 29 Oct 2023 12:11 IST

టీమ్‌ఇండియాపై ఆకాశ్‌ చోప్రా అనూహ్య స్పందన

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ లేదా ఇంగ్లాండ్‌ సిరీస్‌.. ఈ రెండింటిలో టీమ్‌ఇండియా దేనిలో గెలవాలని కోరుకుంటారు? అని అడిగితే ఇంగ్లాండ్‌ సిరీస్‌కే ఓటేస్తానని మాజీ ఓపెనర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. జూన్‌ 18 నుంచి టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలోనే చోప్రా తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్లో ఓ వీడియో పంచుకున్నాడు.

‘టీమ్‌ఇండియా టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవాలని కోరుకుంటారా? లేక ఇంగ్లాండ్‌ సిరీస్‌ గెలవాలని అనుకుంటారా?’ అని ఓ అభిమాని తనను ప్రశ్నించాడని చోప్రా పేర్కొన్నాడు. అది తనకు కష్టమైన ప్రశ్నే అయినా తాను మాత్రం ఇంగ్లాండ్‌ సిరీస్‌కే ఓటేస్తానన్నాడు. ‘ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఓవైపు చూస్తే ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌. ఐసీసీ ట్రోఫీల్లో అతిపెద్ద ఈవెంట్‌. దీన్ని తొలిసారి నిర్వహిస్తున్నారు కాబట్టి.. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలుపొంది టీమ్‌ఇండియా ట్రోఫీ కైవసం చేసుకొని ప్రపంచంలోనే మేటి జట్టుగా ఎదగాలని ఉంటుంది. అయితే, నేను చేదు గుళికనే మింగాలనుకుంటున్నా. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమిపాలైనా ఫర్వాలేదు. ఎందుకంటే మన జట్టు ఇప్పుడు బలంగా ఉంది. ఒక్క మ్యాచ్‌ ఓడినంత మాత్రాన పోయేదేంలేదు. ఇది నంబర్‌ వన్‌ టీమ్‌. పాయింట్ల పట్టికతో పాటు గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ముందు ఏ ట్రోఫీ గెలవాలని అడిగితే.. ఇంగ్లాండ్‌ సిరీస్‌కే మొగ్గు చూపుతా. అది ఐదు టెస్టుల సిరీస్‌. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలుపొంది చాలా కాలమైంది. 2007లో చివరిసారి ద్రవిడ్‌ నేతృత్వంలో టీమ్‌ఇండియా అక్కడ సిరీస్‌ సాధించింది. అప్పటి నుంచి మళ్లీ అక్కడ గెలవలేదు’ అని చోప్రా తన అభిప్రాయాన్ని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని