ajay jadeja: అందుకే అతడు పరుగుల రారాజు: జడేజా

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ పరుగుల రారాజు అని కొనియాడాడు.

Published : 28 Sep 2022 01:24 IST

దిల్లీ: మూడేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన తన అభిమానులకు ఆసియా కప్‌ ద్వారా టీమ్‌ఇండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ భారీ ఉపశమనం అందించాడు. ఆనాటి నుంచీ ఆటలో విజృంభిస్తూనే ఉన్నాడు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో చెలరేగిన కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ పరుగుల రారాజు అని కొనియాడాడు. అతడిలో ఉండే స్థిరత్వం ఎనలేనిదని కితాబిచ్చాడు. 

‘‘ప్రపంచంలో పేరున్న క్రికెటర్లకు ఉన్న గొప్ప సామర్థ్యం విరాట్‌లో లేకపోవచ్చు. తనకన్నా గొప్పగా ఆడే వారు భారత జట్టులో ఉండివుండవచ్చు. కానీ అతడిలో ఉండే స్థిరత్వం మరెవరీలోనూ లేదు. గతంలో విరాట్‌ కోహ్లీ రన్స్‌ తీసి ఔటైతే ఎంఎస్‌ ధోనీ మిగిలిన ఆటను పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు అతడి చుట్టూ ఉన్న టీమ్‌ మారింది. దానివల్ల తనతో పాటు ప్రతిఒక్కరికీ కొత్త బంతులతో ఆడటం తేలికైంది.  పటిష్టంగా నిలబడి మ్యాచ్‌ను గెలిపించగల దృఢమైన వ్యక్తి అతడు. పరుగుల వీరుడిగా తనకు దక్కిన గుర్తింపునకు కారణం కేవలం ఆడే సామర్థ్యం మాత్రమే కాదు. అంతకు మించి అతడో స్థిరమైన ఆటగాడు. భారత క్రికెట్‌కు కావలసింది కూడా అదే అని నేను ఆశిస్తాను. ఆటను ఎలా నడిపించాలో కోహ్లీకి తెలుసు’’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆసీస్‌తో జరిగి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి ఆడిన కోహ్లీ.. 48 బంతుల్లో 63 పరుగులు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని