గాయపడ్డా.. బౌలింగ్‌ ఒప్పుకొన్న కారణమదే!

కీలకమైన బ్రిస్బేన్‌ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్‌ఇండియా యువపేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు.  కెప్టెన్‌ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్‌ చేస్తానన్నాని...

Published : 23 Jan 2021 17:53 IST

దిల్లీ: కీలకమైన బ్రిస్బేన్‌ టెస్టులో గాయపడినందుకు బాధగా అనిపించిందని టీమ్‌ఇండియా యువపేసర్‌ నవదీప్‌ సైని అన్నాడు. మరోసారి అలాంటి పెద్ద మ్యాచుల్లో అవకాశం దక్కదేమోనని ఆందోళన పడ్డానని గుర్తు చేసుకున్నాడు.  కెప్టెన్‌ అజింక్య రహానె అడగడంతో నొప్పితో బాధపడుతున్నా బౌలింగ్‌ చేస్తానన్నాని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సైని ఆఖరి టెస్టులో గాయపడ్డ సంగతి తెలిసిందే.

‘గాయపడ్డా బౌలింగ్‌ చేయగలవా అని అజింక్య భాయ్‌ అడిగాడు. అందుకు నేను ఔననే జవాబిచ్చాను’ అని సైని అన్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం దక్కినా గాయపడటంతో బాధపడ్డానని అతడు వెల్లడించాడు. ‘నేను బాగున్నాను. కానీ హఠాత్తుగా గాయపడ్డాను. సుదీర్ఘకాలం తర్వాత అవకాశం దక్కింది. అందుకే అత్యంత కీలకమైన ఆటలో నాకే ఎందుకిలా అయిందని బాధపడ్డా. గాయపడ్డా జట్టుకు ఎలాగైనా సాయపడాలని కోరుకున్నా. ఎందుకంటే ఇలాంటి మ్యాచులు మళ్లీమళ్లీ రావని తెలుసు’ అని సైని అన్నాడు.

‘ప్రస్తుతం నేను కోలుకుంటున్నా. త్వరలోనే ఫిట్‌నెస్ ‌సాధిస్తా’ అని సైని తెలిపాడు. టెస్టుల్లో తీసిన నాలుగు వికెట్లలో మొదటి వికెట్‌ ఎంతో ప్రత్యేకమని అతడు పేర్కొన్నాడు. ‘అన్ని వికెట్లూ ప్రత్యేకమే. అయితే మొదటి వికెట్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే అదే జరిగేంత వరకు మనం మొదటి వికెట్‌ గురించి ఆలోచిస్తూనే ఉంటాం కదా’ అని అన్నాడు. బౌన్స్‌కు అనుకూలించే ఆసీస్‌ పిచ్‌లు ఊరించినా అన్ని బంతులు షార్ట్‌పిచ్‌లో వేయలేం కదా అని వెల్లడించాడు. ‘ఆస్ట్రేలియాలో రాణించాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. వారు చివరి వరకు వదిలి పెట్టరు. జట్టు యాజమాన్యం నాకెంతో మద్దుతుగా నిలిచింది. కెప్టెన్‌ రహానె, రోహిత్‌ భయ్యా నాకు అండగా నిలిచారు. రంజీ తరహాలోనే బంతులు వేయాలని సూచించారు’ అని సైని పేర్కొన్నాడు.

హైదరాబాదీ యువపేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తనకు మంచి మిత్రుడని సైని అన్నాడు. తామిద్దరం చాన్నాళ్లు భారత్‌-ఏకు కలిసి ఆడామని వివరించాడు. ‘నా తొలి మ్యాచులో అతడు పూర్తిగా నాతోనే ఉన్నాడు. వేగం ముఖ్యమే అయినా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మీదా దృష్టి పెట్టాలని నాకు సూచించాడు. సిరాజ్‌ భిన్నమైన బౌలర్‌. తండ్రి మరణించినా ఆసీస్‌లోనే ఉండి సాహసం చేశాడు. అతడు సాధించిందంతా జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది’ అని పేర్కొన్నాడు. తన  ఎదుగుదలలో టెన్నిస్‌ బంతి క్రికెట్‌ పాత్ర ఎంతో ఉందని సైని గుర్తు చేసుకున్నాడు. రంజీల్లోకి వచ్చాకే ప్రొఫెషనల్‌ క్రికెట్‌పై దృష్టి పెట్టానన్నాడు. అంతకు ముందు ఎలాంటి లక్ష్యం లేకుండా ఆడేవాడినని పేర్కొన్నాడు. రంజీ తర్వాతే ఒక్కో మెట్టు ఎదిగానని వెల్లడించాడు.

ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్‌ చెప్పలేదు.. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని