WTC Final: చేతి వేలికి గాయం.. స్పందించిన అజింక్య రహానె!

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final) గెలవకపోయినా.. కనీసం డ్రాగా ముగిసినా ఆసీస్‌తో కలిసి సంయుక్త విజేతగా భారత్‌ నిలిచే అవకాశం ఉంది. అలా జరగాలంటే రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు గొప్పగా పోరాటం చేయాలి.

Published : 10 Jun 2023 13:56 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో భారత్‌ భారీ లక్ష్య ఛేదనకు దిగడం ఖాయం. ప్రస్తుతం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 123/4 స్కోరుతో కొనసాగుతోంది. దీంతో ఆధిక్యం 296 పరుగులకు చేరింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ క్రమంలో భారత్‌కు ఆసీస్‌ కనీసం 400కుపైగా పరుగులను  లక్ష్యంగా నిర్దేశిస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత బౌలర్లు విజృంభించి కట్టడి చేస్తే పరిస్థితి వేరేలా ఉండొచ్చు. దీంతో భారీ ఛేదనలో టాప్‌ ఆర్డర్‌తోపాటు మిడిలార్డర్‌ ఆడటం కీలకం.

తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన అజింక్య రహానె (89) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో చేతి వేలికి గాయమైనప్పటికీ పోరాడాడు. మరి రెండో ఇన్నింగ్స్‌లో ఆడగలడా..? లేదా..? అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. తాజాగా దీనిపై రహానె స్పందించాడు. ‘‘నా చేతి వేలికి అయిన గాయం పెద్దదేమీ కాదు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌పై ప్రభావం చూపదని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించాడు. 

గ్రీన్‌ అద్భుత క్యాచ్‌పై..

‘‘తొలి ఇన్నింగ్స్‌లో నా ఆటతీరుపై ఆనందంగా ఉంది. మేం కనీసం 320-330 పరుగులు చేస్తామని భావించాం. కానీ, అది సాధ్యపడలేదు. గ్రీన్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరక తప్పలేదు. అతడు మంచి ఫీల్డర్‌ అని తెలుసు. ఇప్పుడు ఆసీస్‌ ఆధిక్యంలోనే ఉంది. అయితే, మా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కో సెషన్‌ను ఆడుతూ ముందుకు సాగాలి. ఇవాళ తొలి గంట మాకు కీలకం. వారిని త్వరగా ఔట్‌ చేస్తే పట్టు సాధించేందుకు అవకాశం దొరుకుతుంది. జడేజా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటికీ సీమ్‌ బౌలర్లకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది’’ అని రహానె తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని