IND vs WI: విండీస్‌తో చివరి రెండు టీ20లు.. కళ్లన్నీ శ్రేయస్‌పైనే..!

టీమ్‌ఇండియా వెస్టిండీస్ పర్యటన చివరి అంకానికి చేరింది. శని, ఆదివారాలు ఆఖరి రెండు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడనుంది. ఇప్పటికే భారత జట్టు కరీబియన్‌ గడ్డపై 3-0తో వన్డే సిరీస్...

Published : 05 Aug 2022 17:29 IST

ఫ్లోరిడా: టీమ్‌ఇండియా వెస్టిండీస్ పర్యటన చివరి అంకానికి చేరింది. శని, ఆదివారాలు ఆఖరి రెండు టీ20లను అమెరికాలోని ఫ్లోరిడాలో ఆడనుంది. ఇప్పటికే భారత జట్టు కరీబియన్‌ గడ్డపై 3-0తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకోగా పొట్టి ఫార్మాట్‌లోనూ 2-1 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన రెండు టీ20ల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకోనుంది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పైనే నెలకొని ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు (0 , 10 , 24) పూర్తిగా విఫలమయ్యాడు.

అలాగే గత రెండున్నర నెలల్లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి మొత్తం 9 అవకాశాలిచ్చినా ఒక్కదాంట్లోనూ కనీసం అర్ధ శతకం సాధించలేదు. దీంతో ఇప్పుడు అతడిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నారు. శ్రేయస్‌ ప్రస్తుతం షార్ట్‌పిచ్‌ బంతులతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయం విండీస్‌ పర్యటనలో మరోసారి రుజువైంది. అంతకుముందు ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ అతడు ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. మరోవైపు త్వరలో జరగబోయే ఆసియా కప్‌ టోర్నీలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉండటంతో శ్రేయస్‌కు పోటీ తీవ్రం కానుంది.

ఇక ఇటీవల వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న దీపక్‌ హుడా సైతం శ్రేయస్‌ కన్నా మెరుగ్గా కనిపిస్తున్నాడు. అతడు కూడా శ్రేయస్‌ స్థానానికి ఎసరుపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ద్రవిడ్‌ ఒకవేళ చివరి రెండు టీ20ల్లోనూ అవకాశం ఇస్తే శ్రేయస్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు మూడో టీ20లో రిటైర్డ్‌ హర్ట్‌గా మధ్యలోనే వెనుదిరిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అతడు ఫామ్‌ కొనసాగిస్తే భారీ ఇన్నింగ్స్‌ ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బౌలింగ్‌లో అవేశ్‌ఖాన్‌ గత రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయినా.. హర్షల్‌ పటేల్‌ ఇంకా గాయం నుంచి కోలుకోనందున మళ్లీ అతడికే అవకాశం ఇచ్చే వీలుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో అవకాశం రాని కుల్‌దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని