CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు

సీఎస్‌కే (CSK) గెలిచిన ఐదో ఐపీఎల్‌ (IPL 2023) టైటిల్‌ను ధోనీతోపాటు జడేజా, అంబటి రాయుడు అందుకోవడం అభిమానులను అలరించింది. 

Published : 03 Jun 2023 02:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) విజేతగా చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) నిలిచింది. ధోనీ నాయకత్వంలో సీఎస్‌కే ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో యెల్లో ఆర్మీ సంబరాలు అంబరాలను తాకాయి. అయితే, కప్‌ను తీసుకునే క్రమంలో ధోనీ చేసిన ఓ పని అభిమానులను, క్రికెట్‌ ప్రేమికులను ఆకట్టుకుంది. తనతోపాటు ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లను కప్‌ తీసుకొనేందుకు స్టేజ్‌పైకి తీసుకెళ్లాడు. తొలుత వారి చేతుల్లోనే కప్‌ను ఉంచాడు. అందులో ఒకరు చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచి చెన్నైను గెలిపించిన రవీంద్ర జడేజా కాగా.. మరొకరు అదే మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఐపీఎల్‌కే వీడ్కోలు పలికిన అంబటి రాయుడు (Ambati Rayudu) ఉన్నాడు. 

ధోనీ చర్య పట్ల ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని, మ్యాచ్‌ అనంతరం తన గురించి మాట్లాడటం కూడా ఎంతో ఆనందంగా ఉందని  అంబటి రాయుడు పేర్కొన్నాడు. ‘‘ముగింపునకు కాస్త ముందు నన్ను, జడేజాను ధోనీ పిలిచాడు. ట్రోఫీని అందుకోవడానికి తనతోపాటు మమ్మల్ని రమ్మన్నాడు. మా ఇద్దరితో అలా చేయించడం ఇదే సరైన సమయమని అతడు భావించాడు. అయితే, మాకు అది ప్రత్యేకమైంది. మళ్లీ ఇలా జరుగుతుందని అనుకోవడం లేదు. ధోనీ సంగతి ప్రపంచమంతా తెలుసు’’ అని రాయుడు వివరించాడు. అంబటి రాయుడు ఇప్పటి వరకు ఆరు టైటిళ్లను గెలిచిన జట్టులో సభ్యుడు కావడం విశేషం. ముంబయి, చెన్నై జట్ల తరఫున మూడేసి టైటిళ్లలో భాగస్వామిగా ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని