Saba karim: రోహిత్‌, ధావన్‌కు అతడు ప్రత్యామ్నాయం: సాబా కరీం

కేఎల్‌ రాహుల్‌ను రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తానని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సాబా కరీం అన్నాడు. 

Published : 03 Dec 2022 01:18 IST

దిల్లీ: రానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా సన్నద్ధతను మొదలుపెట్టింది. ఈ టోర్నమెంట్ ముంగిట న్యూజిలాండ్‌తో టీ20 ఫలితం నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్‌ 4న బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సాబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ను రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తానని తెలిపాడు. 

‘‘కేఎల్‌ రాహుల్‌ను నేను శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మకు ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా చూస్తాను. రాహుల్‌ క్లాస్‌ ఆటగాడు. ఓపెనర్‌గా అతడు బాగా ఆడాడు. ఫామ్‌ అందుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోడు. కానీ, అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కి దిగుతాడో తెలియదు. ఒకవేళ ఓపెనర్‌ స్థానం కాకపోతే మిడిలార్డర్‌లో ఆడిస్తాం. కానీ, ఆ స్థానాన్ని ఎంతకాలం పొడిగించగలం? ఇప్పటికే దానికి చాలా పోటీ ఉంది. ప్రస్తుతం జట్టులో నెలకొన్న సందిగ్ధత ఇదే. కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌ కలిసి వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం చూపాలి’’ అని తెలిపాడు.  

కొత్త ఆటగాళ్లు రజత్‌ పటిదార్‌, రాహుల్‌ త్రిపాఠికి జట్టులో అవకాశం కల్పించడంపై మాట్లాడుతూ.. ‘‘జట్టులో వీరిద్దరూ ప్రతిభావంతులు. భారత టీ20 లీగ్‌, దేశీయ క్రికెట్‌లో ఇప్పటికే నిరూపించుకున్నారు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని నేను ఇంతకుముందే సూచించాను. ఆటగాళ్ల సామర్థ్యాలను ముందుగానే లెక్కించకుండా ఇలాంటి యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తే బాగుంటుంది. కొత్తగా ప్రయత్నించాలనుకునే క్రికెటర్లకు ఇది చాలా మంచి సమయం. ఈ విషయంలో ముందుగా సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి ప్రణాళికలు తయారుచేయాలి’’ అని సాబా కరీం వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని