IND vs PAK: ‘మేం ఆడేది లేదు’ రమీజ్‌ రజా హెచ్చరికలు.. స్పందించిన అనురాగ్ ఠాకూర్‌

వచ్చే ఏడాది పాక్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రజా చేసిన కీలక వ్యాఖ్యలపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ స్పందించారు.

Published : 27 Nov 2022 10:00 IST

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది పాక్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్ రజా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ కార్యదర్శి జైషా.. పాక్‌తో తటస్థ వేదికలపైనే ఆడతామని, ఆ దేశంలో పర్యటించే అవకాశం లేదని చెప్పాడు. జైషా వ్యాఖ్యలకు పీసీబీ ఛైర్మన్‌ హోదాలో రమీజ్‌ రజా అధికారికంగా స్పందించాడు.. గతంలోనే ఇదే విషయంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ స్పందించినా.. ఇప్పుడు తాజాగా మరోసారి రమీజ్‌ రజా వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ క్రీడల్లో భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమని.. తమను ఎవరూ శాసించలేరని పేర్కొన్నారు.

‘‘భారత్‌, పాక్‌ బోర్డుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై తప్పకుండా స్పందిస్తాం. అయితే సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. ప్రపంచ క్రీడల్లోనే అత్యంత శక్తిమంతమైన దేశం భారత్‌. ఇతర దేశాలు ఏవీ మాపై అధికారం చెలాయించలేవు’’ అని అనురాగ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అన్ని దేశాలు పాల్గొంటాయని గతంలోనే అనురాగ్‌ తెలిపారు. ఇది బీసీసీఐ అంతర్గత విషయమని, సరైన దిశగానే పరిష్కారమవుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని