Team India: భారత క్రికెట్‌ భవిష్యత్‌ సూపర్‌ స్టార్లు వారే: కుంబ్లే

యువ క్రికెటర్లు అర్ష్‌దీప్‌ సింగ్ (Arshdeep singh), ఇషాన్‌ కిషన్ (Ishan kishan) వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జట్టులో సుస్థిర స్థానం కోసం కష్డపడుతున్నారు. తప్పకుండా వీరద్దరూ మంచి స్టార్లుగా ఎదుగుతారని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.

Published : 01 Feb 2023 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత క్రికెట్‌ భవిష్యత్తు తారలుగా యువ క్రికెటర్లు అర్ష్‌దీప్‌ సింగ్, ఇషాన్‌ కిషన్ మారతారని క్రికెట్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే తెలిపాడు. వీరిద్దరూ ఎదుగుతున్న తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఐపీఎల్‌లోని పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అర్ష్‌దీప్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. అనిల్‌ కుంబ్లే గత సీజన్‌ వరకు పంజాబ్‌ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో అత్యంత తక్కువ వ్యవధిలోనే అర్ష్‌దీప్‌ కీలక పేసర్‌గా మారడం అద్భుతమని కుంబ్లే అన్నాడు. గతేడాది ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్‌ కీలక బౌలర్‌గా మారాడు. ‘‘అర్ష్‌దీప్‌తో కలిసి పని చేశా. టీమ్‌ఇండియా కోసం అతడు ఎదుగుతున్న తీరు అద్భుతం. రాబోయే కాలంలో భారత బౌలింగ్‌ సూపర్ స్టార్‌గా మారతాడు’’ అని కుంబ్లే తెలిపాడు. గత జులైలో టీ20 అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌ 25 మ్యాచుల్లో 39 వికెట్లు తీశాడు. కేవలం మూడు వన్డేలను మాత్రమే ఆడిన అర్ష్‌దీప్‌ ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేదు.

యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్ నైపుణ్యమున్నబ్యాటర్‌ అని, భవిష్యత్తులో తప్పకుండా ఉన్నత శిఖరాలకు వెళ్తాడని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ‘‘బ్యాటింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ సూపర్బ్‌.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడు కూడా భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా ఎదుగుతాడు’’ అని వెల్లడించాడు. అయితే కుంబ్లే అభిప్రాయానికి భిన్నంగా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్ మరో ఇద్దరిని ఎంపిక చేసుకొన్నాడు. ఉమ్రాన్‌ మాలిక్‌, తిలక్‌ వర్మ వైపు మొగ్గు చూపాడు. తిలక్‌ వర్మ నాయకుడిగా మారే సత్తా ఉందని తెలిపాడు. 

‘‘ఉమ్రాన్‌ బౌలింగ్‌ చాలా వేగంగా ఉంటుంది. ఇప్పటికే భారత్‌ తరఫున ఆడుతున్నాడు. అతడు కూడా సూపర్‌ స్టార్‌గా మారతాడు. బ్యాటింగ్‌లో తిలక్‌ వర్మకే నా ఓటు. గత కొన్నేళ్లుగా అతడి ఆటతీరును పరిశీలించండి. కేవలం బ్యాటింగ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లేదు. భవిష్యత్తులో జట్టును నడిపించగల సత్తా కూడా అతడిలో ఉంది’’ అని పటేల్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని