Team India in Asia Cup : ధోనీ, యువీ లేని లోటును తీర్చే బాధ్యత వారిద్దరిదే: అశ్విన్

మిడిలార్డర్‌ బలంగా ఉంటే ఎలాంటి జట్టునైనా ఓడించే అవకాశం ఉంటుంది. ఆసియా కప్‌ (Asia Cup 2023) కోసం బరిలోకి దిగనున్న భారత జట్టులోనూ శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌పై క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 

Published : 25 Aug 2023 11:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియా నాలుగో స్థానంపై చర్చ జరుగుతుండగా.. భారత సీనియర్‌ ఆటగాడు అశ్విన్ తాజాగా ఐదో స్థానంలో వచ్చే బ్యాటర్‌పై మరిన్ని బాధ్యతలు ఉంటాయని చెబుతున్నాడు. దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ (MS Dhoni), యువ్‌రాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఈ స్థానం కోసం భారత్‌ (Team India) సరైన ఆటగాడిని వెతుకుతూనే ఉందని వ్యాఖ్యానించాడు. యువీ నాలుగో స్థానంలో.. ధోనీ ఐదో స్థానంలో క్రీజ్‌లోకి రావడం వల్ల భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉండేదని గుర్తు చేశాడు. ఇప్పుడు మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్‌ ఇలాంటి పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. 

‘‘ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి వారి స్థానాలను భర్తీ చేసే వారి కోసం టీమ్‌ఇండియా వెతుకుతూనే ఉంది. ఇప్పుడు కేఎల్ రాహుల్‌ తన అనుభవంతో భర్తీ చేస్తాడని భావిస్తున్నా. వికెట్ కీపర్ - బ్యాటర్‌ అయిన కేఎల్ తప్పకుండా ఐదో స్థానంలో సరిపోతాడనిపిస్తోంది. రిషభ్ పంత్ గాయపడకుండా ఉంటే పరిస్థితి విభిన్నంగా ఉండేది. ఎడమచేతివాటం బ్యాటర్‌ కావడంతోపాటు దూకుడుగా ఆడే పంత్‌ జట్టులో ఉంటే మరింత కలిసొచ్చేది. పంత్ ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ రెండో ఆప్షన్‌గా ఉండేవాడు. ఇప్పుడు అతడు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇషాన్‌ కిషన్‌ ఇప్పుడు రెండో వికెట్ కీపర్‌గా అందుబాటులో ఉంటాడు. వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోగల ఆటగాడు ఇషాన్‌. మరోవైపు రాహుల్‌ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు అనిపించినా.. ఆసియా కప్‌ తొలి గేమ్‌కు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నా. ఒకవేళ ఫిట్‌ కాకపోతే ఎలానూ సంజూ శాంసన్‌ రీప్లేస్‌మెంట్ చేయడానికి ఉన్నాడు. 

Team India: ఇటు ముంబయివాలా.. అటు గుజరాతీ

కేఎల్ రాహుల్‌ ఎంత ముఖ్యమో శ్రేయస్‌ అయ్యర్ కూడా కీలక ఆటగాడు. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అత్యుత్తమ ఆటగాడు అయ్యర్. నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. స్పిన్‌ను కూడా సమర్థంగా ఆడతాడు. గతంలోనూ ఇదే స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే నాలుగో స్థానానికి ఢోకా ఉండదు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం భారత్ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అదనంగా స్టాండ్‌ బై ప్లేయర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది. 

ఒలొంగ ట్వీట్‌పై అశ్విన్ స్పందన..

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్‌ మృతి చెందాడంటూ మాజీ ఆటగాడు హెన్రీ ఒలొంగ చేసిన ట్వీట్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్లు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. కాసేపటికే హీత్ స్ట్రీక్‌ మృతి చెందలేదని.. పొరపాటుకు చింతిస్తూ ఒలొంగ మరో పోస్టు పెట్టాడు. అలాగే స్ట్రీక్‌ కూడా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను బతికే ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనిపై అశ్విన్‌ స్పందించాడు. ‘‘నేను కూడా హెన్రీ ఒలొంగ ట్వీట్ చూసి సంతాపం వ్యక్తం చేశా. బాధతో, నమ్మశక్యం కాని పరిస్థితుల్లో స్పందించా. హీత్ స్ట్రీక్‌ బాగున్నారని తెలిసి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. నా నుంచి వచ్చిన ట్వీట్‌కు క్షమాపణలు చెబుతున్నా’’ అని ట్వీట్ చేశాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు