Asia Cup 2023: వారిద్దరి వల్లే పాక్‌ అలా మారింది.. మిగతా జట్లు పారాహుషార్: అశ్విన్

ఆసియా కప్‌లో (Asia Cup 2023) భారత్‌, పాకిస్థాన్‌ జట్లే ఫేవరేట్స్‌ అని.. కాకపోతే పాకిస్థాన్‌ జట్టుతో మరింత ప్రమాదకరమని భారత సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

Published : 30 Aug 2023 11:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ - నేపాల్‌ (PAK vs NEP) జట్ల మధ్య మ్యాచ్‌తో నేడు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) మినీ టోర్నీ ప్రారంభం కానుంది. ముల్తాన్‌ వేదికగా ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు పాక్‌ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ మొదలు కానుంది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీ ఫేవరేట్‌గా టీమ్‌ఇండియాతో పాటు (Team India) పాకిస్థాన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) వ్యాఖ్యానించాడు. ఇద్దరు ప్లేయర్ల వల్లే గత ఐదారేళ్లుగా పాకిస్థాన్‌ పటిష్ఠంగా మారిందని పేర్కొన్నాడు. అందుకే, ఆసియా కప్‌ బరిలోకి దిగే జట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.

‘‘పాకిస్థాన్‌ను చూస్తుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఐదారేళ్ల కిందట వరకు ఆ జట్టు మెగా టోర్నీల్లో ఇబ్బంది పడేది. ఆసియా కప్, వరల్డ్‌ కప్‌ వంటి టోర్నీల్లో పేలవ ప్రదర్శన చేసేది. గతంలో ఐసీసీ ట్రోఫీలను గెలిచిన అనుభవం ఉన్నప్పటికీ కొంతకాలం కిందట వరకు అదే పరిస్థితి. అయితే, గత ఆరేళ్లుగా మాత్రం బాబర్ అజామ్‌, మహమ్మద్ రిజ్వాన్ భాగస్వామ్యంలో పాక్‌ జట్టు అద్భుతంగా పుంజుకుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో (భారత్‌లో మినహా) ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం కూడా వారికి కలిసొచ్చింది. వారు స్క్వాడ్‌ను ఎంపిక చేసుకొనే తీరు కూడా బాగుంది. సూపర్ ఫాస్ట్‌ బౌలర్లను తయారు చేసుకుంటూనే ఉన్నారు. 90ల్లో ఉన్నమాదిరిగా పాక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కూడా స్ట్రాంగ్‌గా మారింది.

ఒకసారి భారత్‌.. మరోసారి పాక్‌ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?

పీఎస్‌ఎల్‌తోపాటు బీబీఎల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు విరివిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా టెస్టు క్రికెట్‌ను కూడా ఎక్కువగానే ఆడటం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లోని కఠిన పిచ్‌లపై మ్యాచ్‌లను ఆడిన అనుభవం పాక్‌ ఆటగాళ్లకు ఉంది. అలాగే ఎమిరేట్‌ లీగ్‌, యూఎస్‌ఏ, కెనడా, సీపీఎల్‌ లీగుల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లలోని టాలెంట్‌ను వెలికి తీసేందుకు అవకాశం లభించినట్లువుతుంది. ఐపీఎల్‌ ద్వారా మన ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఇక పాక్‌ జట్టులో బాబర్ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తే వారికి తిరుగుండదు. ఈ ఆసియా కప్‌లో ఎక్కువగా శ్రీలంక వేదికగానే మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు పాక్‌ వారే కావడం గమనార్హం. కాబట్టి, వారికి ఇది కూడా సొంత మైదానాల కిందే లెక్క. అందుకే, పాకిస్థాన్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని