అశ్విన్‌, కుల్‌దీప్‌, పాండ్య ‘వాతి’ స్టెప్పులు.. 

ఇంగ్లాండ్‌పై రెండో టెస్టు గెలిచాక టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో...

Updated : 20 Feb 2021 11:45 IST

వీడియో పంచుకున్న టీమ్‌ఇండియా స్పిన్నర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌పై రెండో టెస్టు గెలిచాక టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. అయితే, మూడో టెస్టు ఈనెల 24న అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగనుండటంతో ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఈ క్రమంలో వారికి వారం రోజుల విశ్రాంతి దొరకడంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లు సంతోషంగా గడుపుతున్నారు.

అందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ప్రముఖ తమిళ హీరో విజయ్‌ నటించిన మాస్టర్‌ సినిమాలోని వాతి పాటకు స్టెప్పులేశాడు. అందులో అశ్విన్‌తో పాటు హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌లు కూడా కాలు కదిపారు. మొతేరా స్టేడియంలోని జిమ్‌లో వీరంతా ఉత్సాహంగా చిందులేశారు. ఇది చూసి వాతి సంతోషపడతాడంటూ అశ్విన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ చెన్నై స్పిన్నర్‌ రెండో టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన అతడు బ్యాటింగ్‌లోనూ శతకంతో మెరిశాడు. దీంతో భారత్‌ సిరీస్‌లో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

మరోవైపు తొలి టెస్టులో అవకాశం రాని కుల్‌దీప్‌ రెండో టెస్టులో తక్కువ ఓవర్లే బౌలింగ్‌ చేసే అవకాశం దక్కింది. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ రాణించడంతో కుల్‌దీప్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక టీమ్‌ఇండియా కీలక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య టెస్టు జట్టుకు ఎంపికైనా తుది జట్టులో ఇంకా అవకాశం రాలేదు. మరి బుధవారం నుంచి ప్రారంభమయ్యే డే/నైట్‌ టెస్టులోనైనా అతడికి అవకాశం వస్తుందో లేదో వేచిచూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని