ICC Rankings: ఐసీసీ ర్యాంకులు.. అశ్విన్‌ నంబర్‌వన్‌.. దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఆల్‌రౌండర్ల విభాగాల్లో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు.

Updated : 15 Mar 2023 20:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకొచ్చారు. తాజాగా ఐసీసీ ర్యాంకులను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో.. ఆసీస్‌తో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (705) ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగు పర్చుకున్నాడు. ప్రస్తుతం చీకూ (విరాట్) 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్ (800) నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. రోడ్డుప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్ 9వ స్థానం, టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (739) పదో స్థానంతో  భారత్‌ నుంచి టాప్‌ -10 జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్‌ బ్యాటర్ మార్నస్‌ లబుషేన్ (915) అగ్రస్థానంలో నిలిచాడు. 

ఇక  ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా టాప్‌ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇంతకుముందు వరకు జేమ్స్‌ అండర్సన్‌ (859)తో కలిసి సంయుక్తంగా నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన యాష్‌ (అశ్విన్‌) పది పాయింట్లను అదనంగా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 869 పాయింట్లతో అశ్విన్ కొనసాగుతున్నాడు. టాప్‌ -10 బౌలర్ల జాబితాలో అశ్విన్‌ కాకుండా సీనియర్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (780) ఏడో స్థానంలో, రవీంద్ర జడేజా (753) 9వ స్థానంలో ఉన్నారు. 

ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు భారత్‌ ఆటగాళ్లవే కావడం విశేషం. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో  ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ను ఉమ్మడిగా గెలుచుకున్న టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా (431), రవిచంద్రన్ అశ్విన్ (359) వరుసగా మొదటి, రెండో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానలో కొనసాగుతున్న జడేజా.. బౌలర్ల లిస్ట్‌లో మాత్రం ఒక ర్యాంక్‌ కిందికి దిగజారి 9వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో రాణించి.. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ (316) కూడా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 4వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. 

రెండో ర్యాంక్‌లోనే భారత్‌

జట్లపరంగా ఐసీసీ టాప్‌ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పుల్లేవు. అయితే పాయింట్ల పరంగా మాత్రం ఆసీస్‌కు భారత్ చేరువగా వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (106), దక్షిణాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్‌ (88), శ్రీలంక (88), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్‌ (46), అఫ్గానిస్థాన్ (40) టాప్‌ -10లో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని