IND vs PAK: వరుణుడి ఆటంకం.. భారత్, పాక్ మ్యాచ్‌ రద్దు

వర్షం కారణంగా భారత్, పాక్‌ మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి.

Updated : 02 Sep 2023 22:35 IST

పల్లెకెలె: వర్షం కారణంగా ఆసియా కప్‌లో భారత్, పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్‌ ఆరంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. తొలుత భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. మొత్తంమ్మీద టీమ్‌ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచగా.. ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితమయ్యారు. తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేశారు. ఆటగాళ్లు కూడా గ్రౌండ్‌లోకి అడుగుపెడుతుండగా మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో ఆటగాళ్లు డగౌట్‌లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వర్షం మరింత ఎక్కువైంది. దీంతో మైదాన తడిసిముద్దయింది.  దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం, ఈ మ్యాచ్‌లో ఒక పాయింట్‌తో కలిపి మూడు పాయింట్లు దక్కించుకున్న పాకిస్థాన్‌ సూపర్ 4కు వెళ్లింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో సెప్టెంబరు 4న తలపడనుంది.

తొలుత టాస్‌ గెలిచి టీమ్‌ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14) విఫలమయ్యారు. దీంతో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను ఇషాన్‌ కిషన్ (82), హార్దిక్ పాండ్య (87) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను ఆదుకున్నారు. పాక్‌ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4,  నసీమ్ షా 3, హారిస్‌ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని