Jay Shah: జై షాపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి: ఏసీసీ

ఏసీసీ షెడ్యూల్‌ రూపకల్పనలో జై షా (Jay Shah) ఏకపక్షంగా వ్యవహరించారని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌ నజిమ్‌ సేథి చేసిన ఆరోపణలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఖండించింది.

Published : 07 Jan 2023 00:06 IST

ఇంటర్నెట్ డెస్క్: తమను సంప్రదించకుండా 2023-23కు సంబంధించి ఏసీసీ క్యాలెండర్‌ను ప్రకటించారని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు  ఛైర్మన్‌ నజిమ్‌ సేథి ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంలో ఏసీసీ అధ్యక్షుడు జై షా (Jay Shah) ఏకపక్షంగా వ్యవహరించారని నజిమ్‌ సేథి ఆరోపించారు. ‘ఏసీసీ క్యాలెండర్‌ను ముఖ్యంగా పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చే ఆసియాకప్‌ వివరాలను ఏకపక్షంగా ప్రకటించినందుకు జై షాకు కృతజ్ఞతలు. పీఎస్‌ఎల్‌ 2023 క్యాలెండర్‌నూ మీరే ప్రకటించండి’ అని పీసీబీ (PCB) చీఫ్‌ నజమ్‌సేథి వ్యంగంగా ట్వీట్‌ చేశాడు. ఈ ఆరోపణలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఖండించింది. ఏసీసీ షెడ్యూల్‌ రూపకల్పన కోసం 2022 డిసెంబర్‌లో పాకిస్థాన్‌తోపాటు అన్ని సభ్య దేశాల నుంచి సలహాలు, సూచనలు కోరామని ఏసీసీ పేర్కొంది. కొన్ని సభ్యదేశాలు తమ అభిప్రాయాన్ని పంచుకోగా.. పాక్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదని స్పష్టం చేసింది.

‘ఏసీసీ అధ్యక్షుడు జై షా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని షెడ్యూల్‌ను రూపొందించి ప్రకటించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ నజిమ్‌ సేథి ఆరోపణలు చేశారు. ఈ విషయంలో స్పష్టత రావాలని ఏసీసీ కోరుకుంటోంది. షెడ్యూల్‌ రూపకల్పన  సరైన విధానంలోనే జరిగింది. 2022, డిసెంబరు 13న జరిగిన సమావేశంలో అభివృద్ధి, ఆర్థిక, మార్కెటింగ్‌ కమిటీ షెడ్యూల్‌ను ఆమోదించింది. ఈ క్యాలెండర్‌ గురించి పాకిస్థాన్‌తో సహా అన్ని సభ్యదేశాలకు డిసెంబర్‌ 22న ఈ మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చాం. అప్పుడు షెడ్యూల్‌ గురించి పీసీబీ ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా నజిమ్ సేథి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. వాటిని ఏసీసీ తీవ్రంగా ఖండిస్తుంది’ 

ఆసియాకప్‌ సెప్టెంబరులో జరుగుతుందని, టోర్నీ ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో ఉంటుందని గురువారం ఏసీసీ ప్రకటించింది. అయితే టోర్నీకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందో చెప్పలేదు. షెడ్యూల్‌ను కూడా ప్రకటించలేదు. వాస్తవానికి 2023 ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో జరగాలి. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో ఆడటానికి భారత్‌ సిద్ధంగా లేదు. ఈ టోర్నీలో భారత్‌తోపాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, ఓ క్వాలిఫయర్‌ జట్టు పోటీపడతాయి. దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని