Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం

ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్‌లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది.

Updated : 03 Oct 2023 20:00 IST

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్‌లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది. రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తిన చివర్లో వేగం పెంచి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి నుంచి వేగంగా పరుగెత్తిన రిరికా హిరోనకా (జపాన్‌) చివర్లో శక్తిని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. సోమవారం మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్‌ రజత పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మహిళల జావెలిన్‌త్రో ఫైనల్‌లో అన్నురాణి (62.92 మీ) ఈటెను విసిరి స్వర్ణం అందుకుంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విద్య రామ్‌రాజ్‌ (55.68 సె) కాంస్య పతకం అందుకుంది. పురుషుల 800 మీ ఫైనల్‌లో మహ్మద్‌ అఫ్సల్‌, డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ రజత పతకాలు సాధించారు. పురుషుల ట్రిపుల్‌జంప్‌ ఫైనల్‌లో ప్రవీణ్‌ (16.68 మీ) కాంస్య పతకం అందుకున్నాడు. పురుషుల బాక్సింగ్‌లో (+92కేజీలు) సెమీ ఫైనల్‌లో నరేందర్ కమ్షిబెక్ (కజకిస్థాన్‌) చేతిలో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌లో భారత్‌కు పతకాలు రాలేదు. పాలక్‌షా ఐదో స్థానంలో, సంతోష్‌ కుమార్ ఆరో స్థానంలో నిలిచారు. మహిళల హైజంప్‌లో ఫైనల్‌లో పుజా ఆరు, రుబీనా తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం మీద భారత్ ఇప్పటివరకు 69 పతకాలు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్య పతకాలున్నాయి. 

నేడు (మంగళవారం) పతకాలు సాధించినవారు

పారుల్ చౌదరీ.. (మహిళల 5000 మీ) స్వర్ణం
అన్ను రాణి (జావెలిన్ త్రో) స్వర్ణం
అప్సల్ (పురుషుల 800 మీ) రజతం
తేజస్విన్‌ శంకర్‌ (డెకాథ్లాన్‌) రజతం
అర్జున్ సింగ్, సునీల్ సింగ్ (కనోయింగ్‌ డబుల్స్‌) కాంస్యం
 ప్రీతి (బాక్సింగ్‌, 54 కేజీలు) కాంస్యం
విద్య రామ్‌రాజ్‌ (మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌) కాంస్యం
ప్రవీణ్ (ట్రిపుల్ జంప్) కాంస్యం
నరేందర్ (బాక్సింగ్) కాంస్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని