IND vs AUS: ఇందౌర్ పిచ్‌కు ‘పేలవం’ రేటింగ్‌.. అదే కదా వారి పని: ఆసీస్‌ కోచ్‌

ఇందౌర్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో (IND vs AUS) ఆసీస్‌ చేతిలో భారత్‌కు పరాభవం తప్పలేదు. కేవలం  రెండున్నర రోజులోపే మ్యాచ్‌ ముగియడంతో పిచ్‌కు ఐసీసీ (ICC) రేటింగ్‌ ఇస్తూ డీమెరిట్‌ పాయింట్లను జతచేసింది.

Published : 05 Mar 2023 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు వేదిక ఇందౌర్‌ పిచ్‌కు  ఐసీసీ (ICC) ‘పేలవ’ రేటింగ్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ తీరుపై టీమ్‌ఇండియా (Team India) దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందౌర్‌కు మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. గబ్బా పిచ్‌పైనా ప్రశ్నలు సంధించాడు. తాజాగా ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ (Andrew McDonald) ఇదే విషయంపై స్పందించాడు. ఆటగాళ్ల కర్తవ్యం ఆడటం వరకేనని, ఐసీసీ (ICC) తమ బాధ్యత ప్రతి పిచ్‌కు రేటింగ్‌ ఇవ్వడమని వ్యాఖ్యానించాడు. 

‘‘ఎలాంటి పిచ్‌ అయినా ప్లేయర్లుగా మన పని ఆడటమే. ఏదిఏమైనాసరే సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాల్సిందే. ఇక ఐసీసీ ప్రతి పిచ్‌కూ రేటింగ్‌ ఇస్తుంది. ఇప్పుడు ఇందౌర్‌ పిచ్‌కు ‘పేలవం’ రేటింగ్‌ ఇచ్చింది. మంచి రేటింగ్‌ ఇచ్చినప్పుడు మనం అస్సలు మాట్లాడం. కాబట్టి, ఐసీసీ నిర్ణయాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నారో వారిష్టం (విమర్శకులు). అయితే, పిచ్‌ పరిస్థితులు మాత్రం దారుణంగానే ఉన్నాయి. గత మూడు టెస్టుల్లోనూ ఆతిథ్య జట్టు ఇలాంటి వాటినే వినియోగించి ఉంటుందని నేను భావిస్తున్నా’’ అని మెక్‌డొనాల్డ్‌ తెలిపాడు. 

ఐసీసీ పిచ్‌, అవుట్‌ఫీల్డ్ మానిటరింగ్‌ కమిటీ ప్రకారం.. ఏదైనా క్రికెట్‌ వేదికకు ఐదేళ్ల కాలంలో 5 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్‌ పాయింట్లు వస్తే నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆసీస్‌తో మూడో టెస్టు అనంతరం ఇందౌర్ స్టేడియానికి మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఇక సిరీస్‌ విజేతను తేల్చే నాలుగో టెస్టు మ్యాచ్‌ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో భారత్‌ కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ మన సొంతమవుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ టాప్‌ ర్యాంక్‌నూ ఖాతాలో వేసుకొనే ఛాన్స్ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని